హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గులాబీ రంగు బ్యాలెట్, ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్తో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులే కాకుండా ఇతర రాష్ర్టాల (ఎమ్మెల్యేలు, ఎంపీలు) సభ్యులు కూడా ఎక్కడయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇందుకోసం పోలింగ్కు 10 రోజుల ముందు ఆయా రాష్ర్టాల్లోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి సభ్యులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 8న ఆ గడువు ముగిసింది. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఎం మహిధర్రెడ్డి తన ఓటు హక్కును హైదరాబాద్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకుంటానని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణపై గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పోలింగ్ నిర్వహణ, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో 12 గంటలకు సమీక్షిస్తారు.