ICRISAT | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): పంటలకు నష్టం చేసే మిడతల రాకను ముందుగానే పసిగట్టే ప్రత్యేకమైన పరికరాన్ని వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ అభివృద్ధి చేసింది. పర్యావరణంలో కలిగే మార్పుల వలన వృద్ధి చెందే మిడతల సంతతిని, వాటి రాకను పసిగట్టి, వాటిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలను తీసుకునే ప్రోటోకాల్కు శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. మిడతలు అత్యంత వేగంగా తమ సంతతిని వృద్ధి చేసుకుని పంట పొలాలపై మూకుమ్మడిగా దాడి చేస్తాయని తెలిపారు.
వాటి దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పీ-లాకోస్ట్ అనే టూల్ సాయపడుతుందని చెప్పారు. పెరిగే ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో హెచ్చు తగ్గుదల మిడతల సంతతి వేగంగా పెరిగేందుకు సహకరిస్తున్నట్టు గుర్తించారు. మారుతున్న ఉష్ణోగ్రతలు, మిడతల సంతతిని ముందుగానే గుర్తించే సెన్సార్లతో పనిచేసే ఈ పీ-లాకోస్ట్ పరికరం రైతులకు ఎంతగానో సహకరిస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని ఆఫ్రికా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించారు.