హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రోస్టర్ పాయింట్స్ను తగ్గించాలని, సంక్షేమ పథకాల్లో ప్రత్యేక కోటా కేటాయించాలని శారీరక దివ్యాంగుల ఉద్యోగ సాధన సమితి కోరింది. ఈ మేరకు గురువారం సమితి నేతలు హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్లో రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సర్కార్ కట్టుబడి ఉన్నదని, రోస్టర్ పాయింట్స్ తగ్గించే అంశాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సమితి నేతలు నారా నాగేశ్వరరావు, కొల్లి నాగేశ్వరరావు, సుమన్, నాగరాజు, రామచందర్, రమేశ్, శ్రీనివాస్, శంకర్, అలివేలు తదితరులు ఉన్నారు.