హైదరాబాద్, మే 27, (నమస్తే తెలంగాణ): కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. పెట్రోలియం ధరలను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల తాము భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. తమకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 31న ‘నో పర్చేజ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం అమరేందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోలియం ధరలను తగ్గించడం హర్షణీయమే అయినప్పటికీ దీనివల్ల డీలర్లకు వాటిల్లే నష్టాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.
పెట్రోలియం ధరలు 2017 నుంచి దాదాపు రెట్టింపు అయినప్పటికీ డీలర్లకు చెల్లించే మార్జిన్ను మాత్రం పెంచలేదని వివరించారు. ధరల పెరుగుదల వల్ల తమకు పెట్టుబడి వ్యయం పెరిగినప్పటికీ దీనికి అనుగుణంగా మార్జిన్ పెంచాలని కేంద్రానికి డీలర్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 తర్వాత మూడు సందర్భాలలో ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల ఆయిల్ కంపెనీలకు లాభం చేకూరింది తప్ప డీలర్లకు ఏమీ ఒరగలేదని అమరేందర్రెడ్డి వివరించారు. పెట్రోలియం ధరల అస్థిరత్వం వల్ల డీలర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల పెట్రోల్ బంకులు ఆ రోజు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ నెల 31న ‘నో పర్చేజ్’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్కు చెందిన 7 సరఫరా స్థానాలలో లోడింగ్, సరఫరా జరుగకుండా చూసుకోవాలని అసోసియేషన్ తమ డీలర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. శుక్రవారం సాయంత్రం అసోసియేషన్ డీలర్లతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించగా 18 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
పెట్రోలియం డీలర్లు తమ వద్ద ఎప్పటికీ 20 నుంచి 25 వేల లీటర్ల స్టాక్ కలిగి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం డీలర్లను సంప్రదించకుండానే అకస్మాత్తుగా లీటర్పై ఎనిమిది రూపాయలు తగ్గించడంతో ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన స్టాక్ను తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల వారి వద్ద ఉండే స్టాక్కు సంబంధించి ఒక్కో లీటర్పై సుమారు రూ.8 చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. ఇలా 20 నుంచి 25 వేల లీటర్లపై సంభవించే నష్టం డీటర్లకు పెనుభారంగా పరిణమిస్తుంది. తమతో ముందుగా చర్చించకుండా కేంద్రం నిర్ణయం తీసుకున్నదనేది డీలర్ల ప్రధానమైన ఫిర్యాదు.