హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు రాష్ర్టాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనటం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచుకొనేందుకు అనుమతించేది కేంద్రమేనని, రాష్ర్టాలు కాదని తెలిపారు. ఒక్క వారంలో ఎనిమిదిసార్లు ధరలు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి ఏటా రూ.3 లక్షల కోట్లు వస్తున్నదని, అందులో 49 శాతం రాష్ర్టాలకు ఇవ్వాల్సి ఉన్నా మోదీ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు.
రాష్ర్టాలకు వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు పన్నుల రూపంలో కాకుండా సెస్ల రూపంలో కేంద్రం వసూలు చేస్తూ రాష్ర్టాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇంత మోసం, దగా చేస్తూ మళ్లీ రాష్ర్టాలపైనే దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని విమర్శించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.