హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 22 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మహానగర పరిధిలోని మూడు జిల్లాల్లోనే జరుగుతుండటం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతున్నది. రాష్ట్రంలో టీఎస్ బీపాస్ కింద గత రెండేండ్లలో అనుమతుల తీరుపై ఇటీవల పురపాలకశాఖ నివేదిక విడుదల చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధుల్లో ఎంత విస్తీర్ణంలో ఎన్ని నిర్మాణాలకు అనుమతి ఇచ్చారనే వివరాలను అందులో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన అనుమతుల్లో సగం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉండటం విశేషం.
మధ్యతరగతి ఇంటి కల సాకారం
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ అనుమతుల్ని ఒకే గొడుగు కిందకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్బీపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. 75 గజాల్లోపు ఇంటికి అనుమతులు అవసరం లేదంటూ ప్రభుత్వం నిరుపేదలకు ఊరట కల్పించింది. అంతకుమించిన విస్తీర్ణంలోని నిర్మాణాల అనుమతికి దళారుల ప్రమేయం లేకుండా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొనేలా ఏర్పాటు చేసి మధ్యతరగతి ఇంటి కలను సాకారం చేసింది. నిర్ణీత గడువులోగా అనుమతి ఇవ్వకుంటే.. అనుమతి ఇచ్చినట్టుగా భావించాలనే విప్లవాత్మక నిబంధనలు తీసుకొచింది. అనుమతుల మంజూరులో నిర్లక్ష్యం ప్రదర్శిఃచే అధికారులకు జరిమానాలు సైతం విధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా రెండేండ్లలో హైదరాబాద్ మహానగర పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లోనూ టీఎస్ బీపాస్ కింద అనుమతులు ఇస్తున్నారు. ఇప్పుడు గ్రామపంచాయతీ స్థాయిలోనూ టీఎస్ బీపాస్ కిందనే అనుమతులు మంజూరు చేస్తున్నారు.