TSPSC | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నేపథ్యంలో మంగళవారం టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అదుపులోకి తీసుకున్న 37 మంది నిందితులు ఏ పరీక్ష రాయకుండా నిషేధం విధించింది. తిరిగి నిర్వహించే పరీక్షలనూ వారు రాయకుండా ఉండేందుకు హాల్టికెట్లు డౌన్లోడ్ కాకుండా సాంకేతికంగానే కట్టడి చేయాలని కమిషన్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ కేసులో ఉన్న అభ్యర్థులు మున్ముందు కూడా మరే పరీక్షకు అసలు దరఖాస్తు చేసే అవకాశమే లేకుండా చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం సాంకేతికపరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఏమైనా అభ్యంతరాలుంటే రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ 44 మందిపై కేసు నమోదు చేయగా, 43 మందిని అరెస్టు చేసింది. మిగతా అభ్యర్థుల విషయంలోనూ ఇదే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నది.
మరో నలుగురి రిమాండ్
నాంపల్లి కోర్టులు, మే 30 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురికి రిమాండ్ విధించారు. చాట్జీపీటీ సహకారంతో సమాధానాలు రాసినట్టు గుర్తించిన ప్రశాంత్, మహేశ్, నరేశ్తో పాటు ఏఈ పేపర్ కొనుగోలు చేసిన శ్రీనివాస్ నాయక్ను మంగళవారం జువైనల్ కోర్టు ముందు సిట్ అధికారులు హాజరుపర్చారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ మెజిస్ట్రేట్ జీ రాధిక ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ విద్యుత్తు శాఖ డీఈ రమేశ్ను మాత్రం ఇప్పటివరకు కోర్టు ముందు హాజరుపర్చలేదు. ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్, నూతన్ రాహుల్కుమార్, దామినేని రవితేజ తరఫున వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
అన్నాచెల్లెలు సహా ఏడుగురికి నోటీసులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారణను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అన్నాచెల్లెలు రాయపురం విక్రం, రాయపురం దివ్య సహా మరో ఐదుగురి కస్టడీ కోసం సిట్ అధికారులు నోటీసులు జారీచేశారు. వారితో పాటు పూల రవికిషోర్, ధనావత్ భరత్నాయక్, పశికంటి రోహిత్కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్కుమార్ను 8 రోజులు సిట్ కస్టడీకీ అప్పగించాలని మంగళవారం కోర్టు ముందు పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సిట్ పీపీ కృష్ణయ్య వారి కస్టడీ కోరుతూ వాదనలు పూర్తి చేశారు.