మంత్రి సత్యవతిరాథోడ్
కురవి, మార్చి 1: సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా కోరుకొంటున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలు, రైతులను మరిచిపోయిందన్నారు. రైతులు, ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఒకే ఒక్క నేత సీఎం కేసీఆర్ అని ఆమె పేర్కొన్నారు. కాళేశ్వరం నీటితో రైతుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్యేతర కూటమిని కూడగట్టి ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ప్రసాదించి దేశ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని కోరుకొన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భక్తుడు కావడంతో రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మిస్తున్నారని చెప్పారు.