హైదరాబాద్ : సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. బుధవారం అమీర్ పేట డివిజన్ హనుమాన్ టెంపుల్, కుమ్మరి బస్తీ, సిక్కు వాడ, హరిజన బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిక్కు వాడలో ప్రచారానికి ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రగా ఉండటం మన అదృష్టం అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందని తెలిపారు.
2014 కు ముందు నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్క్ ల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా ఎలా ఉండేది… ఇప్పుడెలా ఉంది అనేది కండ్ల ముందే కనిపిస్తుందని వివరించారు. తాను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుడిని కాదని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు BRS పార్టీని బలపర్చాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ BRS అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు సంతోష్, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, బాగిందర్ సింగ్, టిల్లు, సురేందర్ సింగ్, ఆనం జీత్ కౌర్, సుమిత్, లక్ష్మణ్, లలితా చౌహాన్, హరిసింగ్, నరేందర్ రెడ్డి, శేఖర్, అనిల్, నరేష్ తదితరులు ఉన్నారు.