హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఒక అవగాహన ఉన్నదా? అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ప్రస్తుతం జర్నలిస్టులు అన్యాయమైన జీవితం గడుపుతున్నారని, వారి జీవన పరిస్థితులు మెరుగుపర్చడం కోసం ఏమైనా సంక్షేమ చర్యలు చేపట్టారా? అని నిలదీశారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ హెల్త్కార్డులు ఇవ్వాలని, రిటైరైన జర్నలిస్టుల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తి భద్రత, కనీస వేతనం అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఎంప్యానెల్మెంట్ అయిన చిన్న పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గురువారం రెండు గంటలపాటు జీరో అవర్ కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు 60 మంది సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లోని కీలక సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, రోడ్ల మరమ్మతులు, పెండింగ్ ప్రాజెక్టులు, స్థానిక పరిపాలనా విభాగాల ఏర్పాటు వంటి అంశాలపై సభ్యులు గళమెత్తారు.