వరంగల్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయాల్లో కడియం శ్రీహరి చీడపురుగులాంటి వారని, ఆయనకు కనీస నైతికత, నీతి, నిజాయితీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం దళిత నాయకులు, కార్యకర్తలను ఎదగకుండా కుట్రలు చేసిన చరిత్ర శ్రీహరికి ఉన్నదని విమర్శించారు. తన బ్లాక్మెయిల్ రాజకీయాలతో పదవులు పొందడమే ఆయన నైజమని దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, హనుమకొండ జడ్పీ చైర్మన్ ఎం సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డిలతో కలిసి వినయభాస్కర్ శుక్రవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు చేసి అధిష్ఠానానికి తప్పుడు సమాచారం అందిస్తూ.. నీచమైన రాజకీయాలు చేసిన వ్యక్తి అని విమర్శించారు. కడియం శ్రీహరి టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని బ్లాక్మెయిల్ చేసి పదవులు అనుభవించారని ఆరోపించారు. కేటీఆర్, తాను, పెద్ది సుదర్శన్రెడ్డి తెలంగాణ కోసం కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించామని గుర్తుచేశారు.
బీఆర్ఎస్లోకి రాగానే కడియం స్వార్థానికి దళిత నేతలు విజయరామారావు, రాగమళ్ల పరమేశ్వర్, దొమ్మాటి సాంబయ్య, పసునూరి దయాకర్, అరూరి రమేశ్ రాజకీయంగా బలైపోయారని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని బీఆర్ఎస్ కడియం శ్రీహరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కడియం కావ్య అభ్యర్థిత్వంపై ఉద్యమకారులు, దళిత సంఘాలు వ్యతిరేకించినా వారిని ఒప్పించి టికెట్ ఖరారు చేశామని తెలిపారు. మార్చి 31న నిర్వహించే వరంగల్ పార్లమెంటరీ సమావేశం గురించి చర్చించేందుకు గురువారం సాయంత్రం తాను కడియం శ్రీహరి ఇంటికి వెళ్లానని, అప్పుడూ పార్టీ మారే విషయం చెప్పలేదని విస్మయం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక ప్యాకేజీ మాట్లాడుకొని కడియం, ఆయన బిడ్డ ఓ లేఖను విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని వినయ్భాస్కర్ పేర్కొన్నారు.
శ్రీహరిది దిగజారుడు రాజకీయం: పెద్ది
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిది దిగజారుడు రాజకీయం అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కడియం శ్రీహరి బాధ్యుడని అన్నారు. అన్ని పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ద్రోహం చేశారని మండిపడ్డారు. అధికారం ఎకడ ఉంటే కడియం అక్కడ ఉంటారని విమర్శించారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి అని, స్వార్థంతో ఆయన పార్టీ మారితే జరిగే నష్టం ఏమీ లేదని హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అన్నారు.