హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రక్రియతోపాటు పునరావాస కాలనీ పనుల పురోగతిపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపారు.
కవ్వాల్లో ఆయన స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించటంతో పాటు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. మొదటి దశలో పునరావాసానికి రాంపూర్, మైసంపేట గ్రామాలు స్వచ్ఛందంగా అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటవీశాఖ రెండు ప్రతిపాదనలతో పనులను చేపట్టింది. గ్రామాల తరలింపులో భాగంగా ఒకో కుటుంబానికి ఏకమొత్తంగా రూ.15 లక్షల పరిహారాన్ని అందిచటం ఓ ప్రతిపాదన.
దీనికి 48 కుటుంబాలు అంగీకరించి పరిహారం స్వీకరిస్తున్నాయి. రెండవ ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు రూ.15 లక్షల పరిహారంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఓ ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటు 2.81 ఎకరాల సాగు భూమిని సమకూర్చుతున్నది.
వారి కోసం అటవీ ప్రాంతం వెలుపల కొత్త మద్దిపడగలో 12.36 ఎకరాల్లో అన్ని వసతులతో పునరావాస కాలనీని నిర్మిస్తున్నది. ఈ పనులన్నీ పూర్తి కాగానే లబ్ధిదారులకు ఇండ్లు అందజేస్తామని డోబ్రియాల్ తెలిపారు. ఆయనతోపాటు కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్, నిర్మల్, మంచిర్యాల డీఎఫ్వోలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొన్నారు.