హైదరాబాద్: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వంటేరి యాదవరెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శాసన మండలిలోని తన కార్యాలయంలో ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పట్నం మహేందర్ రెడ్డి, మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా వంటేరి యాదవరెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.
శాసనమండలికి స్థానిక స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యుల కాలపరిమితి జనవరి నాలుగున ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 10న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి, యాదవరెడ్డితోపాటు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, దండె విఠల్, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. అప్పటికే కల్వకుంట్ల కవిత సహా ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, వీరి ఎన్నికను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 5న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.