హైదరాబాద్, జులై 31 (నమస్తే తెలంగాణ): గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సోమవారం లోక్సభలో గిరిజన యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్సింగ్ విడుదల చేసిన బులెటిన్లో ఉన్నది. దీంతో రాష్ట్రంలో ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కావచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
అలుపెరుగని పోరాటం
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి ఈ అంశంపై అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని అనేకసార్లు లేవనెత్తారు. గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించారు. ఉన్నత విద్యాలయాల కేటాయింపులో మోదీ సర్కారు తెలంగాణపై ఇప్పటికే తీవ్ర వివక్ష ప్రదర్శించిందనే విమర్శలున్నాయి. నవోదయ, ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐబీఎం, ఐసర్, ట్రిఫుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు.. ఇలా అనేక విద్యాలయాల ఏర్పాటులో మొండిచెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినా గిరిజన యూనివర్సిటీని ఇప్పటికీ కేటాయించలేదు. ఈ విద్యా సంస్థ కోసం మంత్రి కేటీఆర్ గత ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రి అర్జున్ముండాకు లేఖ రాశారు.
గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు