హనుమకొండ, జూన్ 20: దేశాన్ని అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న నిరుద్యోగులపై పెట్టిన కేసులను విరమించుకొని, యువతకు ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అగ్నిపథ్ వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన చేపడుతుంటే, తగ్గేది లేదంటూ కేంద్రం ఒంటెత్తు పోకడలకు పోతున్నదని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రుల మాటలు పుండుమీద కారం చల్లినట్టున్నాయని విమర్శించారు. అగ్నివీరులకు బట్టలు ఉతకడం, కటింగ్, షేవింగ్ చేయడం నేర్పి వారు బయటకు వచ్చిన తర్వాత ఆ పనులు దొరికేటట్టు చేస్తామని కిషన్రెడ్డి అవమానిస్తే, బీజేపీ కార్యాలయాల వద్ద గార్డులుగా పెట్టుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అవహేళన చేశారని మండిపడ్డారు.
మీ పిల్లలను అగ్నివీరులుగా పంపే దమ్మున్నదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడి కుటుంబానికి, గాయపడ్డవారికి కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో వరంగల్ యువకుడు రాకేశ్ చనిపోతే అతడి కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.25 లక్షలు ప్రకటించడంతోపాటు అర్హతనుబట్టి ఉద్యోగం ఇస్తానన్న మాటలతోనైనా మోదీలో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ రాజ్యాధికారం పొందాలని చూస్తున్నదని, రాబోయే రోజుల్లో అది చెల్లదన్నారు.
నిరుద్యోగ యువత తొందరపడరాదని, భవిష్యత్తును పాడుచేసుకోకుండా శాంతియుత పోరాటాలను ఎంచుకోవాలని ఎర్రబెల్లి కోరారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, కుడా చైర్మన్ సుందర్రాజుయాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అంబేద్కర్నగర్లోని ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి మంత్రి హాజరై చిన్నారులకు పలక, బలపం అందించి అక్షరాలు దిద్దించారు.
మన ఊరు-మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ పథకానికి కేంద్రం నిధులిచ్చినట్టు నిరూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రం రాష్ర్టానికి ఒక కేంద్ర విద్యాసంస్థను కూడా ఇవ్వలేదని, ఈ అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులెవరికీ ధైర్యం లేదని ధ్వజమెత్తారు.