హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడంలో ఆయిల్ఫెడ్ విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సుమారు 58 వేల ఎకరాల ఆయిల్పామ్ తోటలు గెలలు పెట్టలేదని తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సమస్యను పరిష్కరించడానికి కొత్తగా పామ్-360 పేరుతో యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా తెలిపారు. జీపీఎస్ ద్వారా పని చేసే ఈ యాప్తో రైతుల సమస్యలకు చెక్ పెట్టనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ యాప్తో కూడిన ట్యాబ్ను ఫీల్డ్ఆఫీసర్లకు పంపిణీ చేశారు.
ఫీల్డ్ఆఫీసర్ కచ్చితంగా ఆయిల్పామ్ తోటకు వెళితేనే అది పని చేస్తుంది. తోట ఎలా ఉన్నది, ఎలాంటి సమస్యలున్నాయనే వివరాలను అక్కడికక్కడే యాప్లో నమోదు చేస్తారు. వీటిని హెడ్ ఆఫీస్లోని అధికారులు సమీక్షించి వాటికి పరిష్కారం చూపనున్నారు. పంటకుగల సమస్యను బట్టి తోటలకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఒకవేళ రైతు పంట థర్డ్ గ్రేడింగ్లో ఉంటే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఫీల్డ్ ఆఫీసర్ మళ్లీ ఎప్పుడు ఆ పంటను సందర్శించాలనే తేదీని కూడా నిర్ణయించనున్నారు. ఇలా ఆ పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.