నల్లగొండ : దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ‘ మన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా చందంపేట గ్రామంలో రూ. 2. 52కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని వెల్లడించారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. డిండి ప్రాజెక్టు నీరు చందంపేట, నేరడుగొమ్ము మండలాల చెరువులు నింపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి, సర్పంచ్ గోసుల కవిత,రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్, రమావత్ మోహన్ కృష్ణ, ఎంపీడీవో రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.