హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లో ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ధర్మభిక్షం 104వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు ధర్మభిక్షం అని అన్నారు. గీత కార్మికుల కోసం రాష్ట్ర, జాతీయస్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసి, వారి హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. విద్యార్ధి దశ నుంచే అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదని తెలిపారు. ధర్మభిక్షం కేవలం కమ్యూనిస్టు పార్టీకే కాక, అన్ని పార్టీల వారికి ఆత్మీయుడని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దామోదర్రెడ్డి, పొలగాని రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు.