NIMS | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ దవాఖానలను మించి క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్న నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు కూడా పునర్జీవం ప్రసాదిస్తున్నది. గత ఏడాది నిమ్స్లో ఏర్పాటుచేసిన పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్రల నుంచి కూడా బాధితులు వస్తున్నారు. చిన్నపిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులు వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారంతోపాటు కొన్నిసార్లు గుండెకోతను మిగులుస్తుంది. అయితే నిమ్స్లోని పీడియాట్రిక్ కార్డియో విభాగంలో తక్కువ ఖర్చుతోనే చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.
పేదలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల ద్వారా లక్షల రూపాయల వైద్యాన్ని పైసా ఖర్చు లే కుండా ఉచితంగా అందిస్తున్నది. కార్పొరేట్ దవాఖానల్లో చేతులెత్తేసిన కేసులకు సైతం ఇక్కడ విజయవంతంగా చికిత్స అందిస్తుండటంతో రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతున్నది. సుమారు 25 శాతం కేసులు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నట్టు కార్డియో థొరాసిక్ విభాగాధిపతి అమరేశ్రావు తెలిపారు. వీరిలో ఎక్కువగా ఏపీకి చెందినవారుండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర రోగులున్నట్టు వివరించారు. ప్రతి నెల సగటున 30 క్లిష్టమైన సర్జరీలు చేస్తున్నట్టు చెప్పారు. తమ విభాగంలో ఓపీ సేవలకోసం వస్తున్న రోగుల్లో 80 శాతం మంది చిన్నపిల్లలే ఉంటున్నారని తెలిపారు.
కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వస్తున్న రోగులు
పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగానికి కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కూడా రిఫరల్ కేసులు వస్తున్నాయి. మా వద్దకు వచ్చే దాదాపు అన్ని కేసులు క్రిటికల్ స్టేజీలోనే ఉంటాయి. ప్రతి నెలా 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇప్పటివరకు ఐదు కిలోలలోపు బరువున్న 10 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేశాం. 1.1 కిలోలు ఉన్న వారం రోజుల వయస్సుగల కేసును కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాం. ఎక్కువగా పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉండటం, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, గుండెకు సంబంధించిన కనెక్షన్స్ సరిగ్గా లేకపోవడం, తారుమారుగా ఉండటం, గుండె పనితీరు బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో చిన్నారులను ఇక్కడకు తీసుకొస్తున్నారు
– డాక్టర్ అమరేశ్రావు, కార్డియో థొరాసిక్ విభాగాధిపతి, నిమ్స్ హాస్పిటల్