హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ తెలిపారు. ప్రపంచంలో దేన్నైనా, ఎంతటి కఠినాత్ములనైనా ప్రేమతో జయించొచ్చని చెప్పారు. సోమవారం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ.. బలహీనులను పీడిస్తే ఏదో ఒకరోజు తిరగబడతారని చెప్పారు. తన రచనలన్నీ సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలేనని తెలిపారు.
రచనలతో కొంతైనా అవగాహన కల్పించడమే తన ఉద్దేశమని చెప్పారు. తమ సంస్థ ద్వారా ఏటా ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తామని కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షుడు సతీశ్ వడ్డీ తెలిపారు. అమెరికాలో తెలుగు సంస్థలు రెండేండ్లకోసారి కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న సదస్సుల్లో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని వేణు నక్షత్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ అవధాని నరాల రామిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, ప్రసాద్ చెరసాల, కవిచంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డ నిర్వహించారు.