MLA Kaushik Reddy | పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకుంటే.. ఆయన భారతదేశ చరిత్రలో నిలిపోతారన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారని.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని.. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ ఆయన ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని.. స్పీకర్ వెంటనే స్పందించాలని కోరారు. దానం నాగేందర్ సైతం ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారన్నారు. ఈ విషయంలో స్పీకర్ను కలిసేందుకు వెళ్తే అక్కడ ఎవరూ లేరని.. కేవలం అటెండర్ మాత్రమే ఉన్నారన్నారు. కార్యదర్శి వద్దకు వెళ్లినా ఎవరూ అందుబాటులోకి రాలేదని చెప్పారు. నలుగురం ఎమ్మెల్యేలం కలిసి వెళ్తే కనీసం రిప్రజెంటేషన్ సైతం తీసుకోకుంటే ఎలా? అంటూ వాపోయారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేని పక్షంలో కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
దానం నాగేందర్ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాల్సిందేనన్నారు. కడియం వంటి సీనియర్ నేత సైతం పార్టీని మోసం చేయడమంటే నమ్మించి గొంతుకోయడమేనన్నారు. బీఆర్ఎస్ ఆయనకు ఏం తక్కువ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఆయనకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. కడియం తీరుపై ప్రజలు ఛీఛీ అంటూ కొట్టే పరిస్థితి ఉందన్నారు. ఆయన చెప్పే నీతులు ఇవేనా? అంటూ విమర్శించారు. అన్నం తినేవారైతే ఇలా చేరని.. అన్నం తినకుండా మరొకటి తినేవాళ్లు మాత్రమే ఇలా చేస్తారంటూ విమర్శలు గుప్పించారు.