రాజుగారి బామ్మర్దులు.. రెండో భాగం
సవాల్రెడ్డి ‘పాయింట్ బ్లాంక్’
బియ్యం వివాదంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి బీజేపీ నాయకులంతా ఇప్పుడో కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ‘వరి అధికంగా పండే తమిళనాడు, ఒడిశా, ఆంధ్రకు లేని సమస్య ఇక్కడెందుకు వచ్చింది? అని. బాయిల్డ్ రైస్ మీద తెలంగాణ కావాలని యాగీ చేస్తున్నది తప్ప మిగతా రాష్ర్టాల్లో సమస్యలేదని బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు.
ఇది నిజమా? అక్కడ సమస్య లేదా? అంటే అది పచ్చి అబద్ధం.
కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన రాష్ర్టాలు ఆందోళనలు చేస్తుంటే.. అవకాశమున్న రాష్ర్టాలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి.
కేంద్రం కోరితేనే..
వాస్తవానికి మన రాష్ట్రంలో 2001 వరకు ధాన్యాన్ని ఎఫ్సీఐ నేరుగా కొనేది. 2015లో ధాన్యం సేకరణ తనకు చేతకాదని కేంద్రం రాష్ర్టాన్ని కోరినందువల్లనే రాష్ట్రం ఆ బాధ్యత తలకెత్తుకున్నది. ఈ మేరకు కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రం పూర్తి స్థాయిలో ధాన్యం కొని మిల్లుల్లో మర ఆడించి బియ్యం రూపంలో ఎఫ్సీఐకి ఇవ్వాలి.
ఈ ప్రక్రియలో అయ్యే ఖర్చు కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం తాను సేకరించిన బియ్యంలో తన అవసరాలకు సరిపడా (ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమయ్యే ధాన్యం) తీసుకొని పౌరసరఫరాలశాఖ నేతృత్వంలో నెలనెలా రేషన్షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తుంది. మిగులు బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇస్తుంది. ధాన్యం సేకరణ వ్యవహారం మొత్తం సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ప్రతి సీజన్లో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పు తీసుకొని కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లిస్తుంది. మొదట్లో ఈ సంస్థ నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనేది. తర్వాత ఇందులోకి ఐకేసీ సంఘాలను, సెల్ఫ్హెల్ప్ గ్రూపులను ప్రాథమిక సహకార సంఘాలను దించారు. వారు రైతులనుంచి ధాన్యం తూకం వేసి ఆ మేరకు వారికి రసీదులు ఇచ్చి ధాన్యం లెక్కలు రాస్తారు. ఆ లెక్కల ఆధారంగా సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తుంది. ఇక మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి ఎఫ్సీఐకి అందించి వారిచ్చే రసీదును సివిల్ సైప్లెస్ అధికారులకు ఇచ్చి మిల్లింగ్ రవాణా చార్జీలు తీసుకుంటారు. కేంద్రం చేయాల్సిన ధాన్యం కొనుగోలు బాధ్యతను రాష్ట్రం తలెత్తుకోవడం వల్ల ఒరిగిందేమీ లేదు. ధాన్యం కొనుగోలుకు తెచ్చిన రుణాల మీద కేంద్రంనుంచి రెండు నెలల వడ్డీ మాత్రమే వస్తున్నది. ఎఫ్సీఐ చెల్లింపులు పూర్తిగా సెటిల్ కావడానికి ఏడాది పడుతున్నది. అంటే పది నెలల వడ్డీ రాష్ట్రమే భరిస్తున్నది. దానితోపాటు స్టోరేజీ ఖర్చులు కూడా రాష్ట్రమే మోస్తున్నది. ఎఫ్సీఐ మాత్రం గిరాకీ ఉన్న రాష్ర్టానికి ధాన్యం తరలించి అమ్మి వెంటనే సొమ్ము చేసుకుంటున్నది. మిల్లర్లు మర ఆడించి బియ్యం తెచ్చినా రైల్వే ర్యాక్లు దొరికిన తర్వాతే ఆ బియ్యాన్ని తీసుకుని అపుడే డబ్బు ఇస్తున్నది. రాష్ట్రం మాత్రం ధాన్యం కోతలు ప్రారంభం కాగానే కొనుగోలు కేంద్రాలు తెరిచి తీసుకున్న ధాన్యానికి రైతులకు వెంటనే డబ్బు చెల్లిస్తున్నది. తర్వాత మిల్లర్లు మర ఆడించి ఎఫ్సీఐకి ఇచ్చిన తర్వాత ఎఫ్సీఐ మనకు చెల్లించేదాక నెలల తరబడి వేచి ఉంటున్నది. రైతులనుంచి రాష్ట్రమే ధాన్యం కొంటున్నదని చెప్తున్నది అందుకే.
పార్బాయిల్డ్ ప్రోత్సహించింది కేంద్ర ప్రభుత్వమే..
గమ్మత్తేమిటంటే.. 2001నుంచి దశాబ్దంపాటు పార్బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐ కొనేది. అప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఆ బియ్యానికి డిమాండ్ ఉండేది. అందువల్ల ఎఫ్సీఐ ఒత్తిడిచేసి మరీ యాసంగి బియ్యం కొనిపించేది. అంతటితో ఆగలేదు.. కేంద్రం, ఎఫ్సీఐ 15 శాతం పెట్టుబడి ప్రోత్సాహకాలిచ్చి మరీ పార్బాయిల్డ్ మిల్లుల ఏర్పాటుకు కృషి చేశాయి. అంతకు ముందు రాష్ట్రంలో పార్బాయిల్డ్ మిల్లుల సంఖ్య చాలా తక్కువ. ఎఫ్సీఐ ప్రోత్సాహంతో కోట్లు ఖర్చుచేసి బాయిలర్లు, డ్రైయర్లు కొని రా రైస్ మిల్లులను పార్బాయిల్డ్గా మార్చుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో మొత్తం 2,300 బియ్యం మిల్లులు ఉంటే అందులో రా రైస్ మిల్లులు కేవలం 400 మాత్రమే. పరిస్థితి ఇలా ఉంటే హఠాత్తుగా ఒక సీజన్ ముందుగా రా రైస్ మాత్రమే కొంటామంటే రైస్ మిల్లుల పరిస్థితి ఏమిటి? ఇపుడు హఠాత్తుగా ఆ బియ్యం వద్దే వద్దని అంటే ఆ మిల్లుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
బంగాళాఖాతంలో పారబోస్తామన్న ఒడిశా!
ఒడిశా ప్రభుత్వం గత వానకాలం సీజన్నుంచే పార్బాయిల్డ్ సమస్య మీద కేంద్రంతో యుద్ధం చేస్తున్నది. వానకాలంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సగం శాతమే పార్బాయిల్డ్ రైస్ కొంటామని, యాసంగి సీజన్లో అసలే కొనబోమని ఎఫ్సీఐ పేచీ పెట్టడం మీద ఆ రాష్ట్ర ఆహారమంత్రి ప్రతాప్ స్వైన్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు నిరసన లేఖ రాశారు. డిసెంబర్లో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో బీజేడీ ఎంపీలు ప్రసన్న ఆచార్య, అమర్ పట్నాయక్, సుస్మిత్ పాత్ర, ప్రశాంత్ నందా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తి గోలగోల చేశారు. తమ రాష్ట్రంలో 28 లక్షల టన్నుల పార్బాయిల్డ్ రైస్ మిగులు ఉన్నదని, ఈ సమయంలో ఒక్క గింజ కూడా కొనరాదని కేంద్రం ఆదేశిస్తే ఆ ధాన్యాన్ని బంగాళాఖాతంలో పారబోయమంటారా? అని కేంద్ర మంత్రిని నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్బాయిల్డ్ విధానం మీద ఆందోళనకు దిగుతామని గత అక్టోబర్ నెలలో ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి సీజన్లో పార్బాయిల్డ్ రైస్ కొనాలని డిమాండ్చేస్తూ ఫిబ్రవరిలో అధికార బీజేడీ శ్రేణులు ఎఫ్సీఐ గోడౌన్ల ముందు ధర్నాలు చేశాయి. రైతుల కష్టాలు చూసి సాక్షాత్తూ బీజేపీ శాసనసభ్యుడొకరు ఇంట్లో హాండ్ సానిటైజర్ తాగి నిరసన వ్యక్తం చేశారు. కేవలం ఈ సమస్య కారణంగానే మండీల్లో వారాల తరబడి కొనుగోళ్లు లేక కడుపు మండిన రైతులు తమ ధాన్యాన్ని రోడ్ల మీద పారబోస్తున్నారు. ధాన్యానికి నిప్పు పెడుతున్నారు.
అయినా ప్రాథమికంగా ఒడిశాకు పార్బాయిల్డ్ మనలాగా జీవన్మరణ సమస్య కాదు. ఎందుకంటే అక్కడ మన రాష్ట్రంలోలాగా ఎంత ధాన్యం తీసుకువచ్చినా కొనే విధానం లేదు. నీటి సౌకర్యం ఉన్న భూమికి ఎకరానికి 19 క్వింటాళ్లు, నీటి వసతిలేని భూమి ఎకరానికి 13 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనే సీలింగ్ విధానం అమలులో ఉన్నది. కేంద్రం కొనకపోయినా పడే భారం ఎక్కువగా ఉండదు. అయినా ఆ రాష్ట్రం కేంద్రం వైఖరి మీద యుద్ధం చేస్తున్నది. ఒడిశా ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పడుతుంటే అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, పాలనావైఫల్యాలు అంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ చలిమంటలు కాచుకొంటున్నారు.
అడ్డికి పావుశేరు అమ్మేసుకున్న ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్లో వరి కొనుగోళ్లలో పార్బాయిల్డ్ రైస్ శాతం తక్కువ. వచ్చేవి రాష్ట్ర అవసరాలకు సరిపోతాయి. అందువల్ల అక్కడ ప్రభుత్వం రా రైస్ భారీగా సేకరిస్తుంది. అందువల్ల వారికి పెద్దగా ఇబ్బంది లేదు. గత వానకాలంలో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో పార్బాయిల్డ్ శాతం పెరిగింది. మరోవైపు కేంద్రం వానకాలం సీజన్లో అక్కడ కొనుగోలు టార్కెట్ను 60 లక్షల టన్నుల నుంచి 24 లక్షల టన్నులకు కుదించింది. దీన్ని తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. రాష్ర్టానికి ఎఫ్సీఐకి కుదిరిన ఒప్పందం మేరకు పూర్తి స్థాయిలో కొనుగోలు సాగించాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైన్ కేంద్రానికి లేఖ రాశారు. మిగులు ధాన్యం మీద, తాజా పార్బాయిల్డ్ అంశం మీద సీఎం భూపేశ్ భగేల్ మొత్తం రాష్ట్ర మంత్రులందరితో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ పీఎంవోకు లేఖ రాశారు. అయినా స్పందన లేదు. ప్రతిపక్ష బీజేపీ మాత్రం ఇది ప్రభుత్వం చేతకానితనమంటూ వాట్సాప్ వ్యాసాలు మొదలు పెట్టింది. ఎంత చెప్పినా కేంద్రం మొండికేయడంతో గోదాములు ఖాళీ లేకపోతే యాసంగికీ కొనుగోళ్లు ఆగిపోతాయని, వానకాలంలో సేకరించిన బాయిల్డ్ రైస్ను అక్కడి ప్రభుత్వం బహిరంగవేలంలో క్వింటాల్ మీద రూ.500 నుంచి రూ.600 నష్టానికి అమ్మేసింది. బాయిల్డ్రైస్ వాడుకునే ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ర్టాలు భౌగోళికంగా ఛత్తీస్గఢ్కు చాలా దగ్గర. రైళ్ల వంటి రవాణా సౌకర్యాలున్నాయి. దీనితో అక్కడ ఎఫ్సీఐ కొనకపోయినా మిగులును వ్యాపారులు ఇతర రాష్ర్టాలకు తేలిగ్గా రవాణా చేసి లాభపడుతున్నారు. గుడ్డిలో మెల్ల ఛత్తీస్గఢ్లో ప్రజాపంపిణీ వ్యవస్థకు ఒకేసారి మూడు నెలల సరుకు ఇచ్చే పద్ధతి అమలులో ఉంది. దీనివల్ల గోదాముల్లో అదనపు ఖాళీ ఏర్పడుతుంది.
ఎదురు తిరిగిన బీహార్!
పార్బాయిల్డ్ కొనబోమని కేంద్రం చేసిన ప్రకటనకు చెంపపెట్టుగా బీహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేవలం పారాబాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నది. తాము కొనుగోలు చేసే ధాన్యమంతా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ప్రజలకు అందిస్తామని రాష్ట్ర ఆహారశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శి వినయ్కుమార్ పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఈ బియ్యం వాడకం చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నది. బీహార్లో ధాన్యం కొనుగోలును ప్రాథమిక వ్యవసాయ రుణ సంస్థలు జరుపుతాయి. వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి ప్రభుత్వానికి, పీడీఎస్ విభాగానికి నేరుగా అందిస్తాయి. ఇంతకాలం బీహార్ ప్రభుత్వం రా రైస్ మాత్రమే సేకరించి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేది. అయినా క్షేత్రస్థాయిలో పార్బాయిల్డ్కు ఏనాడూ డిమాండ్ తగ్గలేదు. పార్బాయిల్డ్ రైస్ బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా సంస్కృతిలో భాగమైనాయి. ఆ రాష్ట్రం ఎదుర్కొనే తక్షణ సమస్య ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న 1600 మిల్లుల్లో 115 మాత్రమే పార్బాయిల్డ్ మిల్లులు. మిగిలినవాటిని ఇప్పుడు పార్బాయిల్డ్గా మార్చుకోవాలి. అది భారీ వ్యయంతో కూడిన వ్యవహారం.
పంట చాలని తమిళనాడు..
తమిళనాడు ఉప్పుడు బియ్యాన్ని బాగా వాడే రాష్ట్రమైనా అక్కడ వేసే పంట వారి అవసరాలకే సరిపోవడం లేదు. వచ్చిన పంట సరిపోక ఇంతకాలం ఎఫ్సీఐ నుంచి ఇతర రాష్ర్టాలనుంచి కొంటూ వస్తున్నది. 2009లో తమిళనాడు వ్యాపారులు మన మార్కెట్లకు వచ్చి భారీగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేశారు. తమ రాష్ట్రంలోఅమ్ముకోవడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేశారు. ఇటీవలి కాలంలో ప్రకృతి అనుకూలించి తమిళనాడులో ధాన్యం దిగుబడి పెరిగింది. అయినా మిగులు సమస్య అక్కడ లేదు. కేంద్ర బాయిల్డ్ పాలసీ వల్ల వాళ్లకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వచ్చిన ధాన్యాన్ని తన అవసరాలకు వాడుకుంటున్నందున ఆ రాష్టానికి కేంద్రం కొనకపోయినా నష్టం లేదు. పైగా ఆ రాష్ట్రంలో అనేక నౌకాకేంద్రాలు ఎగుమతులకు అనుకూలం. మిగులు వచ్చినా విదేశాలకు అమ్మకోగలుగుతున్నది.
పంజాబ్లో ఏం చేస్తున్నారు?
ఇవాళ పార్బాయిల్డ్కు కుంటిసాకులతో ససేమిరా అంటూ వేరే పంటలు వేసుకోవాలని సుద్దులు చెప్తున్న కేంద్రం పంజాబ్లో పంట మార్పిడి విషయంలో ఏం చేస్తున్నది? పంజాబ్లో ఎరువుల వాడకం ప్రపంచంలోని అనేక దేశాలకన్నా ఎక్కువ. ఒకే రకమైన పంటల కారణంగా భూమిలో సారం అడుగంటుతున్నది. ఎరువుల కారణంగా కాలుష్యం ప్రమాదస్థితిలో పేరుకుపోతున్నది. ఈ విషయమై అంతర్జాతీయ సంస్థలు కూడా హెచ్చరించాయి. దానితో 15 ఏండ్ల క్రితంనుంచే పంజాబ్లో పంటలను మార్చాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ కిందా మీద పడుతున్నాయి. కానీ ఇప్పటిదాక సాధించింది ఏమీ లేదు. అయినా అక్కడ అవే పంటలను కేంద్రం కొంటున్నది. తెలంగాణకు వచ్చే సరికి కేవలం ఒక సీజన్ ముందుగా పంటలు మార్చుకోవాలని చెప్పి ఆ వెంటనే ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నది.
ఎగుడు దిగుడుగా గిరాకీ…
మన దేశీయ వరికి విదేశాల్లో మార్కెట్ ఉన్నది. నేపాల్, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, వియత్నాం, బంగ్లాదేశ్, సింగపూర్లో ఉప్పుడు బియ్యానికి మార్కెట్ ఉంది. యూరఫ్, అమెరికా మాత్రం మన ధాన్యాన్ని కొనవు. మన పంటలో ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం దానికి కారణం. ఈ మేరకు డబ్ల్యూటీవో ఒప్పందాలున్నాయి. సాధారణంగా 10 వేల కోట్ల టన్నుల ధాన్యం సరఫరాచేసే మనం ఇటీవలి కరోనా కల్లోలం, వియత్నాంలో వరదల సమయంలో 30 వేల కోట్ల టన్నులకు పైగా ధాన్యాన్ని ఎగుమతిచేశాం. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ బియ్యానికి మయన్మార్, పాకిస్తాన్, వియత్నాం, థాయ్లాండ్నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. ఏ యేటి కా ఏడు ఈ దేశాలు ధరలు తగ్గిస్తూ దాదాపు 20 శాతం తక్కువ ధరకు అమ్ముతున్నాయి. మన పార్బాయిల్డ్ రైస్కు ఈ దేశాలు కోట్ చేసే ధరలనుంచి ప్రమాదం ఎదురవుతున్నది. ఇండియా నూక బియ్యానికి మంచి కొనుగోలుదారు చైనా. అక్కడ పశుగ్రాసానికి, నూడుల్స్కి ఈ బియ్యాన్ని బాగా వాడతారు. ఇటీవలికాలంలో ఆ దేశంతో సంబంధాలు సరిగా లేవు. ఆఫ్రికా మనకు అనుకూల కొనుగోలుదారు. అక్కడ పాకిస్తాన్ నుంచి పోటీ ఉన్నది.
తీరం లేకపోయినా ఉత్తరాదికి చేయూత..
దేశంలో షిప్యార్డులున్న ఒడిశా, ఏపీ, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ ధాన్యం ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. చిత్రంగా ఉత్తరాది రాష్ర్టాలకు షిప్యార్డులు లేవు. ధాన్యం తరలింపు వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. వాటితో పోలిస్తే తెలంగాణ కొంత నయం. ఎఫ్సీఐ లాభాలు చూసుకుంటే అక్కడ ధాన్యం కొనుగోళ్లు తగ్గించాలి. షిప్యార్డులు వాటికి దగ్గరగా ఉన్న రాష్ర్టాల్లో కొనుగోళ్లు పెంచి ఎగుమతులు చేయాలి. కానీ జాతీయపార్టీల ఉత్తరాది వ్యామోహం అలా కానివ్వడం లేదు. ఎంత ఖర్చయినా ఉత్తరాది రాష్ర్టాల్లో మొత్తానికి మొత్తం ధాన్యమంతా కొని తరలిస్తున్నాయి. దేశీయంగా చూసుకున్నా పంజాబ్లో వరి వాడకం లేదు. అక్కడ కొన్న ధాన్యం వాడేది దక్షిణాదిలో. అక్కడ ధాన్యం కొని ఇక్కడిదాక తరలిస్తే రవాణా ఖర్చులు తడిసిమోపడవుతాయి. దానికి బదులు దక్షిణాదిలోనే ఉన్న తెలంగాణలో కొని పక్క రాష్ర్టాలకు ఎందుకు తరలించరు? ఎందుకంటే జాతీయపార్టీలను ఉత్తరాది శాసిస్తుంది కనుక. అందువల్లే అక్కడ ఏ పంట పండినా మారు మాట్లాడకుండా కొంటున్నారు. అంతేకాదు పంజాబ్లో యూజర్ చార్జీల కింద 24.25 పైసలు చెల్లిస్తూ తెలంగాణలో 5.65 మాత్రమే చెల్లిస్తున్నాయి. పంజాబ్లో కొనుగోళ్ల సందర్భంగా ఒక్కో క్వింటాల్ మీద గ్రామీణాభివృద్ధి ఫీజు 3 శాతం కింద కోట్ల రూపాయలు ఇస్తున్నది. తెలంగాణకు పైసా ఇవ్వడం లేదు.
దేశీయంగా మన బాయిల్డ్ రైస్ను తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ర్టాల ప్రజలు వాడుతారు. దక్షిణ కర్ణాటక, తమిళనాడులో పిండివంటలకు ఈ రకం బియ్యాన్ని మాత్రమే వాడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉత్పత్తయ్యే 155 లక్షల టన్నుల పార్ బాయిల్డ్ రైస్ లో 90% అక్క డి ప్రజలే వినియోగిస్తారు. బీహార్ ఈశాన్య రాష్ర్టాల్లో రా రైస్ లేక తెల్ల బియ్యాన్ని కేవలం పండుగలు, వేడుకల్లో మాత్రమే వాడుతారు. మిగిలిన రోజుల్లో పార్బాయిల్డ్ రైస్ వాడుతారు. కానీ మన రాష్ట్రం లో ఉప్పుడు బియ్యం వాడకం సున్నాగా ఉంది.
ఈ బియ్యాన్ని పశువులు, కోళ్ల దాణా కోసం మాత్రమే వాడుతున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్లు కూడా యాసంగి వడ్లను రెండేండ్ల కిందటిదాకా పక్క రాష్ర్టాలకు ఎగుమతి చేసేవారు. తమిళనాడు, కేరళ కొనేవి. గతంలో ఓ యాసంగి సీజన్లో కేరళ పౌరసరఫరాల అధికారులు మన రాష్ర్టానికి వచ్చి వ్యాపారులు అడిగిన ధరకు 50 వేల టన్నులు కొనుగోలు చేశా రు. కొన్నేండ్ల క్రితం తమిళనాడు ఒక్కోసారి 20 నుంచి లక్ష క్వింటా ళ్లు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. తాత్కాలికమే కావచ్చు కానీ.. గత రెండు మూడేండ్లుగా వర్షాలు బాగా పడటం, ప్రకృతి వైపరీత్యాల సమస్య అంతగా లేకపోవడంతో తమిళనాడులో ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఒకప్పుడు పార్బాయిల్డ్లో డెఫిసిట్గా ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు అటు ఇటు తన అవసరాల మేర పండించుకుంటున్నది. ఇటు కర్ణాటక, కేరళలో పంటల ఉత్పత్తులు పెరిగి మన వద్ద కొనుగోళ్లు తగ్గుతున్నాయి. ఈ సీజన్లో దేశంలో అత్యధిక పంటలు పండితే గత జనవరిలో సరుకు రవాణా వ్యాగన్లు లేక ఎగుమతులు మందగించాయి. ఉన్న వ్యాగన్లను ఎరువుల తరలింపునకు, అలాగే వేసవి నేపథ్యంలో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపునకు మళ్లించారు. దీనితో రేవుల్లో ఓడలు సరుకులేక నిలిచిపోయాయి. ఇందులో 30 శాతం ఉప్పుడు బియ్యం ఎగుమతులు నిలిచిపోయా యి. ఎగుమతిదారులు ఫిబ్రవరి నెలకోసం జరగాల్సిన కొత్త ఒప్పందాలు వాయిదా వేసుకున్నారు. ఫలితంగా చత్తీస్గఢ్ వంటి మధ్య భరత్నుంచి తూర్పు నౌకా తీరానికి 5 లక్షల టన్నుల బియ్యం తరలింపు నిలిచిపోయింది. ఇదీ కేంద్ర ప్రభుత్వ పాలన తీరు.
అనుమానాలు రేకెత్తిస్తున్న అదానీ స్టోరేజీలు..
అదానీ గ్రూపు 2007లో స్టోరేజీ రంగంలోకి అడుగుపెట్టి ఎఫ్సీఐతో ఒప్పందం కుదుర్చుకొని హర్యానా, పంజాబ్ తదితర రాష్ర్టాలలో సీలోస్ (అధునాతన గోదాములు) ఏర్పాటు చేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఎఫ్సీఐ- ఏఏఎల్ఎల్ (అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్) మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. ఎఫ్సీఐ భారీగా అద్దెలు చెల్లించి ఈ సీలోస్లో తన ధాన్యం నిల్వ చేస్తున్నది. అదానీ గ్రూపు గోడౌన్లకు సరుకు తరలింపునకు ప్రత్యేక ట్రాక్టర్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ సరుకు క్వాలిటీని గుర్తించేందుకు రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో ప్రతి బ్యాగును చెక్ చేసి రేటు కూడా నిర్ణయిస్తుంది.
ధాన్యాన్ని స్టీల్ స్టోరేజీలోకి పంపడానికి కన్వేయర్ బెల్ట్లు ఉంటాయి. సరుకును స్టీల్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు గాలి, అలాగే పదార్థాలు చెడిపోకుండా రసాయనాలను పంపిస్తారు. బయటికి వెళ్లే సరుకు అటోమేటిగ్గా ప్లాస్టిక్ బ్యాగుల్లో ప్యాక్ అయి బయటికి వస్తుంది. సీలోస్లో నిల్వ ఉన్న ధాన్యం ఎలుకలు కొట్టేయడం. ముక్కిపోవడం లేదా వాడిపోవడం చెడి పోవడం ఉండదు. వాస్తవానికి ఇలాంటి టెక్నాలజీని ఎఫ్సీఐ కూడా అమలు చేయవచ్చు కానీ అదానీతో ఒప్పందాలకు ఇచ్చిన ప్రాధాన్యం దానికి ఇవ్వటం లేదు. పైగా 2030 నాటికి దేశమంతా సరుకులను సీలోస్లోనే నిల్వ చేయాలని ఎఫ్సీఐని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కేంద్రం వైఖరి సుస్పష్టం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కేంద్రం లక్ష్యం. అందులో భాగంగానే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతు వ్యతిరేకతతో తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఇపుడు ఒకటొకటిగా ధాన్యం వెరైటీలను తగ్గించుకుంటూ వస్తున్నది. గతంలో డజనుకు పైగా రకాలను కొనుగోలు చేసిన ఎఫ్సీఐ బీజేపీ హయాంలో మూడు నాలుగు పంటలకే పరిమితం కావడం గమనార్హం.
తెలంగాణలో ధాన్యం దిగుబడులు
సంవత్సరాల వారీగా (లక్షల టన్నుల్లో)
తెలంగాణలో వచ్చిన సమస్య ఆంధ్రలో ఎందుకు లేదు?
ఆంధ్రలో ఈ సమస్య ఎందుకు లేదు? అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తారు. ఆంధ్రాలో యాసంగిలో వరిసాగు నామమాత్రంగా ఉంటుంది. అక్కడ జూన్-జూలై వానకాలం సీజన్లో వరి పండించే రైతు తర్వాత రబీ సీజన్కు పంటలు మార్చుతారు. వరికి బదులు పప్పుధాన్యాలు, నూనెగింజలు, మినుములు, చెరుకు, పొగాకు, మిర్చి, పొద్దుతిరుగుడు ఎక్కువగా చేస్తారు. గత ఖరీఫ్ సీజన్నే తీసుకుంటే వరి సాగు విస్తీర్ణం 15.87లక్షల హెకార్లు కాగా రబీ సీజన్ వచ్చేసరికి ఆ విస్తీర్ణం కేవలం 1.87 లక్షల హెక్టార్లు మాత్రమే. రబీలో ఆంధ్ర రైతులు వరికి బదులుగా ఐదున్నర లక్షల హెక్టార్లకు పైగా పప్పుధాన్యాలు వేశారు. ఖరీఫ్లో రాష్ట్రమంతా వరి సాగు ఉంటే యాసంగిలో అది కర్నూలు, గోదావరి జిల్లాల వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం.
అక్కడ కూడా ముందుగానే మిల్లర్లతో కొనుగోలు అగ్రిమెంట్ చేసుకొని ఎక్స్పోర్ట్ రకం వేస్తున్నారు. ఓడ రేవులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కొనకపోయినా రైస్ మిల్లర్లు కొని ఎగుమతి చేస్తారు. దశాబ్దాలనుంచి అదొక సంప్రదాయంగా స్థిరపడింది. అక్కడ రైస్మిల్లర్లకు వారి పరిధిలోని గ్రామాల్లో రైతులతో నేరుగా పరిచయాలుంటాయి.చాలామంది రైస్మిల్లర్లు తమ బియ్యాన్ని బ్రాండింగ్ చేసుకున్నారు. ఇలాంటి వాటిలో లలితా బ్రాండ్ రైస్ ఒకటి దీనికి విదేశాల్లో కూడా మంచి పేరు ఉంది. ఇలాంటి ఒక బ్రాండెడ్ రైస్ సంస్థ ఎగుమతుల వ్యాపారం ఏడాదికి రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఉంటుందని చెప్తారు. వాస్తవానికి 2021-22 రబీలో వరిపంటను సాగును ఈసారి అదనంగా మరో లక్ష ఎకరాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ భావించింది. అయితే కేంద్ర వైఖరి చూశాక చేతులెత్తేసింది. తీర ప్రాంతం కాబట్టి గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మిల్లింగ్లో నూకలు రావడం చాలా తక్కువ. రెండో పంటకు పంట మార్పిడి, ఎగుమతుల భరోసా, రైస్ మిల్లర్లతో అవగాహన వల్ల ఆంధ్రాలో పార్బాయిల్డ్ రైస్ కొనుగోళ్ల సమస్య లేదు.
పంట మార్పిడితో గట్టెక్కుతున్న ఆంధ్రా..
తెలంగాణ విషయంలో నౌకాశ్రయాలు చాలా దూరం. దానివల్ల తెలంగాణ బియ్యం మీద రవాణా ఖర్చులు అధికంగా పడుతున్నాయి. ఆంధ్రలో అనేక చిన్నా పెద్ద షిప్ యార్డులు ఉన్నా..కేంద్రం బియ్యం రవాణాకు అనుమతించిన యార్డ్ కాకినాడ ఒక్కటే. మనకు సమీపంలో ఉన్నది కూడా కాకినాడే. సరుకును అక్కడికి రవాణా భారం మోసి పంపినా ఆ షిప్యార్డ్ భౌగోళికాంశాల తలనొప్పి ఒకటి ఉంది. కాకినాడ వద్ద నౌకాకేంద్రం ఉన్న ప్రదేశం డీప్ సీ కాదు. లోతు తక్కువ. ఇక్కడికి 30 వేల నుంచి 50 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలే రాగలుగుతాయి. 50 వేల టన్నులకు మించిన సరుకైతే అక్కడికి 15 కిమీల దూరంలో సముద్రంలో ఉన్న హోప్ ఐలాండ్ దగ్గరకు బార్జ్ల మీద తీసుకువెళ్లాలి. బియ్యం వంటి సరుకును అక్కడకు చేరవేసి అక్కడ భారీ షిప్లకు ఎక్కించాలి. అందునా కాకినాడ పాతకాలపు పోర్ట్. మెకనైజ్డ్ కాదు. మనుషులతోనే పని చేయించుకోవాలి. వేగం ఉండదు.
మరోవైపు సరిగ్గా ఎగుమతుల సీజన్లో అక్కడ దశాబ్దాలుగా ఎగుమతుల వ్యాపారంలో పాతుకుపోయిన స్థానిక రైస్ మిల్లర్లు ముందుగా షిప్పులను బార్జ్లను బుక్ చేసుకుంటారు. ఇతర ప్రాంతాల వ్యాపారులకు బియ్యం తరలించడానికి అక్కడి రద్దీని బట్టి సీజన్లో పదినుంచి 15 రోజులు పడుతుంది. ఈ మధ్యకాలంలోని వెయిటింగ్ చార్జ్ పేరిట ఖర్చంతా వ్యాపారులే భరించాల్సి వస్తుంది. ఇదంతా తడిసి మోపెడవుతున్నందున ఎగుమతులకు వ్యాపారులు ఇష్టపడటం లేదు. ఇదిలాఉంటే అంతర్జాతీయంగా మనతో పోటీ ఉన్న వియత్నాం లాంటి దేశాలు చెప్తున్న ధరకు మనకు పెద్ద వ్యత్యాసం వస్తున్నది. వాళ్లు 310 డాలర్లకు ఒక యూనిట్ బియ్యం ఇస్తుంటే అదే రకం బియ్యానికి మనకు 350 డాలర్లు అయితే తప్ప గిట్టుబాటు కాని స్థితి ఉంది. అందువల్లనే రాష్ట్రం డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పదేపదే డిమాండ్ చేస్తున్నది. డ్రై పోర్ట్ అంటే షిప్యార్డుల్లో జరగాల్సిన తతంగమంతా ఈ డ్రైపోర్టులోనూ పూర్తి చేసే వ్యవస్థ. అంటే మనం సరుకును ఈ డ్రైపోర్టుకు అందచేస్తే షిప్యార్డ్కు చేర్చినట్టేనన్న మాట. ఈ పోర్ట్ వారే రవాణా తదితర ఖర్చు భరించి మనం ఇచ్చిన ధాన్యాన్ని తీరంలో ఉన్న పోర్ట్కు అదనపు ఖర్చు లేకుండా చేరుస్తారు. షిప్లకు ఎక్కించే పూచీ తీసుకుంటారు. కేంద్రం ఎగుమతులను ప్రోత్సహించే పథకంలో వీరికి పన్నుల రాయితీలు ప్రోత్సాహకాల రూపంలో ఈ వ్యయాన్ని పూడ్చుతుంది.