ఉపాధి కోసం ఆరుగురు యువకులు ఏర్పాటుచేసిన వాయుసేన ఆక్సిజన్ ప్లాంట్ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్య సేవలకు ఊపిరి పోస్తున్నది. రోజూ 5 టన్నుల ప్రాణవాయువును ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలకు సరఫరా చేస్తూ కరోనా బాధితుల ప్రాణాలు నిలుపుతున్నది. క్లిష్ట పరిస్థితుల్లో డిమాండ్కు సరిపడా ఉత్పత్తిచేస్తూ వాహ్వా.. వాయుసేన అనిపించుకుంటున్నది.
మంచిర్యాల, మే 15 (నమస్తే తెలంగాణ): వాయుసేన ఆక్సిజన్ ప్లాంట్ ప్రాణవాయువు కొరతను తీరుస్తున్నది. గతంలో కంటే ఐదురెట్లు అధికంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నది. వైద్య అవసరాలను తీరుస్తున్నది. మంథని ప్రాంతానికి చెందిన పోటు వెంకటేశ్ ఉపాధి కోసం 2016లో మంచిర్యాలకు వచ్చారు. మంచిర్యాల, మందమర్రి ప్రాంతాలకు చెందిన మిత్రులు మహాదేవుని రమేశ్, మహాదేవుని నరేశ్, గంగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కుంభం తిరుపతి, కుంభం మహేశ్వర్తో కలిసి 2018లో మందమర్రి మండలం పులిమడుగులో వాయుసేన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. ప్లాంట్ నిర్మాణంతోపాటు సిలిండర్ల కోసం దాదాపు రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టారు. మందమర్రి నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని డీలర్ల ద్వారా మందుల దుకాణాలు (మెడికల్), వాణిజ్య అవసరాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. 300 సిలిండర్లతో ప్రారంభించిన ప్లాంట్.. ఇప్పుడు 600 సిలిండర్లకు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా చేశారు. గతంలో పరిశ్రమలకు డిమాండ్ ఎక్కువగా, మెడికల్కు తక్కువ ఉండేది. కరోనా రెండో దశ విజృంభణతో నెల రోజులుగా దవాఖానల్లో ఆక్సిజన్ వినియోగం పెరిగింది. దీంతో వాణిజ్య అవసరాలకు సరఫరా నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాలతో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని దవాఖానలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మెడికల్ అవసరాలకే రోజుకు 500 నుంచి 600 సిలిండర్లు నింపుతున్నారు. 30 నిమిషాల్లో 20 సిలిండర్లను ఫిల్ చేస్తున్నారు.
గతంలో రోజుకు టన్నులోపే డిమాండ్ ఉండేది. ఇటీవల దవాఖానల్లో ఆక్సిజన్ వినియోగం పెరిగింది. రోజుకు నాలుగు నుంచి ఐదు టన్నులు సరఫరా చేస్తున్నారు. గతంలో నాగ్పూర్, హైదరాబాద్లోని కంపెనీల నుంచి ద్రవ ఆక్సిజన్ వచ్చేది. ప్రస్తుతం ఒడిశా నుంచి తెప్పిస్తున్నారు. ట్యాంకర్ సామర్థ్యం 20 టన్నులు కాగా, నాలుగు రోజులకు ఒక ట్యాంకర్ వస్తున్నది. ద్రవ (లిక్విడ్) రూపంలో దిగుమతి చేసుకొని ప్లాంట్లో ఆక్సిజన్గా మార్చి సిలిండర్లలో నింపుతున్నారు. వారంనుంచి ఈ ప్లాంట్ రాత్రింబవళ్లూ పనిచేస్తున్నది. గతంలో ఆక్సిజన్ సిలిండర్ను రూ.200 నుంచి 250 వరకు విక్రయించేవారు. లిక్విడ్ ఆక్సిజన్ ధరలు, రవాణా చార్జీలు పెరుగడంతో ప్రస్తుతం ఏడు క్యూబిక్ మీటర్ల బల్క్ సిలిండర్కు రూ.వెయ్యి తీసుకుంటున్నట్టు ప్లాంట్ ఎండీ వెంకటేశ్ తెలిపారు.
జిల్లాలోని దవాఖానల్లో గతంలో రోజుకు 100 సిలిండర్ల ఆక్సిజన్ వినియోగమే ఉండేది. కొద్ది రోజులుగా హాస్పిటల్స్లో 500 పైగా సిలిండర్లు వాడుతున్నారు. ఇటీవల పలు దవాఖానల్లో ఆక్సిజన్ కొరతతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆక్సిజన్ సరఫరాను కలెక్టర్ భారతి హోళీకేరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డిప్యూటీ తాసిల్దార్లను ప్లాంట్ దగ్గర మూడు షిప్టుల్లో నియమించారు. వారి పర్యవేక్షణలో ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
మిత్రులం కలిసి ఉపాధి కోసం వాయుసేన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుచేశాం. కరోనా రెండో దశతో నెల రోజులుగా దవాఖానల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. రోజుకు 4-5 టన్నులు సరఫరా చేస్తున్నాం. అవసరం మేరకు కొన్నిరోజుల నుంచి రాత్రింబవళ్లూ సేవలు అందిస్తున్నాం. ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నామని సంతోషంగా ఉన్నది.
పోటు వెంకటేశ్, మేనేజింగ్ డైరెక్టర్, వాయుసేన ఆక్సిజన్ ప్లాంట్, పులిమడుగు, మందమర్రి మండలం