రాయికల్ రూరల్, మే 17: ఎవుసంలో తనకు వెన్నంటి నిలిచిన ఎద్దుకు కరెంట్ షాక్ తగలగా.. కాపాడబోయి ఎద్దుతోపాటు యజమాని సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్లో మంగళవారం చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన బత్తుల లస్మయ్య (70) తన ఎడ్లను గ్రామ శివారులోని తోటకి మేతకు తీసుకెళ్లాడు. ఇటీవల గాలివాన బీభత్సానికి విద్యుత్తు స్తంభాల తీగలు తెగిపడ్డాయి.
మేతకు వెళ్లిన ఓ ఎద్దుకు విద్యుత్తు తీగలు తగలడంతో షాక్తో కింద పడి కొట్టుకొన్నది. గమనించిన లస్మయ్య పరుగెత్తుకుంటూ వెళ్లి ఎద్దును పట్టుకున్నాడు. దీంతో లస్మయ్యకు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఎద్దుతోపాటు అతడూ మృతి చెందాడు. స్థానికులు విద్యుత్తు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్ తెలిపారు.