Weather Update | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వడగాడ్పులు వీయడంతోపాటు సాయంత్రానికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాడ్పులు వీయవచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీచినట్టు వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి బలహీన పడి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.
శుక్రవారం తెలంగాణలో ఒకట్రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మంలో 44, నల్లగొండలో 43.5, రామగుండంలో 43, ఆదిలాబాద్లో 42.8, హనుమకొండలో 41.5, నిజామాబాద్లో 41.1, మెదక్లో 41, హైదరాబాద్లో 39.7, మహబూబ్నగర్లో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గవచ్చని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.