హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. అతడి నుంచి రూ.1.09 కోట్ల విలువైన 2.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్లో ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద కిలో బరువు ఉన్న రెండు విదేశీ మార్క్ బంగారం కడ్డీలు, మరో రెండు బంగారం కడ్డీలు వంద గ్రాముల బరువు ఉన్నవి గుర్తించారు. విమాన క్యాటరింగ్ సర్వీస్లో పనిచేస్తున్న ఆ వ్యక్తి మిడిల్ఈస్ట్ నుంచి వచ్చే విమానాల ద్వారా ఈ బంగారాన్ని సేకరించినట్టు విచారణలో తేలింది. ఆహారపదార్థాల లోడింగ్, అన్లోడింగ్ సమయంలో వాటి మాటున ఇలా బంగారాన్ని తెచ్చినట్టు గుర్తించారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు అధికారులు తెలిపారు.