హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు ఉండి మత్స్య సొసైటీలు లేని గ్రామాలను గుర్తిస్తున్నామని, 3 నెలలపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతోపాటు 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తామని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ బలోపేతానికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 3,200 మత్స్య సహకార సంఘాలు ఉండగా, వీటిల్లో 2.20 లక్షల మంది సభ్యులు ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం 3.57 లక్షల మందితో 5,200 మత్స్య సహకార సంఘాలు నడుస్తున్నట్టు చెప్పారు. 2016-17 నాటికి చేపల ఉత్పత్తి 1.99 లక్షల టన్నులు కాగా, 2021-22 సంవత్సరానికి 3.89 లక్షల టన్నులకు పెరిగిందని..రాష్ట్ర జీఎస్డీపీలో మత్స్య సంపద వా టా 0.3 శాతం నుంచి 0.5 శాతానికి పెరిగిందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కుంటలను మత్స్యశాఖకు బదిలీ చేసి, త క్కువ ధరతో లీజుకు ఇస్తామని, అన్ని నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు.
ముఖ్యమంత్రి విజన్తోనే నీలివిప్లవం
సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలో నీలివిప్లవం వచ్చిందని, ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తలసాని అన్నారు. గతంలో ఈ వృత్తితో సంబంధం లేని కులాల వారికి మత్స్య సొసైటీల్లో సభ్యత్వాలు ఇచ్చారని, ప్రస్తుతం వృత్తితో సంబంధం ఉన్న వారికి మాత్రమే సభ్యత్వం కల్పిస్తున్నట్టు తెలిపారు. తొలి విడత స్పెషల్ డ్రైవ్లో 7,963 మంది సభ్యులతో 406 మత్స్య సొసైటీలు ఏర్పాటు అయ్యాయని, మరో 241 సొసైటీల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. అనంతరం మత్స్య సొసైటీలలో సభ్యత్వం డ్రైవ్-2 పోస్టర్ను ఆవిషరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
15 రోజుల్లో గొర్రెలు కొనుగోలు చేయాలి
గొర్రెల పంపిణీలో భాగంగా పైలట్ ప్రా జెక్టుగా చేపట్టిన నగదు బదిలీ పథకం లబ్ధి దారులకు 15 రోజుల్లోపు గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. గొర్రెల పంపిణీపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1.58 లక్షల చొప్పున ఖాతాలకు నగదు బదిలీ చేసిందని వివరించారు.