హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ శాఖ జారీ చేసింది.
అన్ని ప్రభుత్వ, మెటర్నిటీ హాస్పిటల్స్లో ప్రతి రోజు ఉదయం 7:30 గంటలకే ఓపీ స్లిప్స్ పంపిణీ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక మొదటి పేషెంట్ నుంచి చివరి రోగి వరకు అందర్నీ వైద్యులు పరీక్షించాలి. అన్ని పని దినాల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. మార్నింగ్ టైమ్లో రక్త నమూనాలను సేకరించి సాయంత్రం వరకు రిపోర్ట్స్ రెడీ చేయాలని చెప్పారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఓపీ సేవల్లోనే సంబంధిత రోగులకు మందులు రాసి పంపించాలన్నారు. ఓపీ సమయాల్లో తప్పకుండా ల్యాబ్లు కూడా పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.