హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై-సాగి) పథకం అమలులో తెలంగాణ చరిత్ర సృష్టించింది. పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో మన గ్రామాలు అగ్రభాగాన నిలిచాయి. టాప్-10లో పదికి పది, టాప్-20లో 19 ర్యాంకులను తెలంగాణ పల్లెలు కైవసం చేసుకొన్నాయి. తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి ఏవిధంగా జరుగుతున్నదో, సీఎం కేసీఆర్ పాలనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయో సాగి ర్యాంకులే దేశానికి చాటి చెప్పాయి. పార్లమెంటు సభ్యులు ప్రతి ఏటా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం 2016లో సాగి పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు, పథకాలను అమలు చేయడంతో పాటు ఎంపీ నిధులను కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దటం ఈ పథకం లక్ష్యం. అభివృద్ధి ప్రణాళికను ఆయా గ్రామస్తులే రూపొందించుకొని, లక్ష్యసాధన మార్గాలను వారే నిర్ణయించుకొంటారు. జీవన ప్రమాణాల అభివృద్ధి, మెరుగైన జీవన విధానాన్ని సాధించడం, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడటం ఈ పథకం లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎంపీలు దత్తత తీసుకొన్న గ్రామాలకు కొన్ని మార్గదర్శకాలు, ప్రామాణికాలను నిర్దేశించి స్కోర్ ఇస్తున్నారు. ర్యాంకులు కేటాయిస్తున్నారు.
అగ్రభాగాన నిలిపిన పల్లెప్రగతి
సాగి ర్యాంకుల్లో తెలంగాణ గ్రామాలు అత్యుత్తుమ స్థానాలు సాధించడంలో పల్లెప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషించాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీటిని అందించడం, పల్లెప్రగతిలో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, ఇందుకు ట్రాక్టర్ను సమకూర్చడం, మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాలు, డంపింగ్షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఠంచన్గా నిధులను విడుదల చెయ్యడం, ప్రతి గ్రామానికీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమించడం తదితర అంశాలు మన పల్లెల స్కోర్ను పెంచడానికి దోహదం చేశాయి.
ఇది గర్వకారణం: మంత్రి కేటీఆర్
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం అమలులో టాప్-10 స్థానాలు తెలంగాణకు రావడం గర్వంగా ఉన్నదని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు.
‘సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో టాప్-10లో మొత్తం పది గ్రామాలు, టాప్-20లో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయని చెప్పుకోవడం గర్వంగా ఉన్నది. సీఎం కేసీఆర్ విజన్కు, పల్లెప్రగతికి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బృందానికి హృదయపూర్వక అభినందనలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
పల్లెప్రగతి వల్లే సాధ్యమైంది
సాగి ర్యాంకుల్లో టాప్-10 స్థానాలు తెలంగాణకు దక్కడం కేసీఆర్ మానస పుత్రిక పల్లెప్రగతి ద్వారానే సాధ్యమైంది. ఇటీవల తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చిన 19 అవార్డులకు ఇది అదనంగా లభించిన ప్రశంస. వీటితోపాటు ఇప్పటికే ఈ-పంచాయతీ, ఈ-ఆడిటింగ్, ఓడీఎఫ్ ప్లస్ వంటి అనేక అంశాల్లో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలుచేస్తుండటంతో గ్రామ పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు లభించి అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా మారుతున్నాయి.
– పంచాతీయరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు