ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వమంతా ఢిల్లీదాక వెళ్లి మొర పెట్టుకొన్నా, మూడున్నరేండ్ల అవసరాలకు సరిపడా అన్నిరకాల తిండి గింజలు ఎఫ్సీఐ గోదాముల నిండా ఉన్నాయని..
ఇక ఏమాత్రం కొనలేమని కేంద్రం చేతులెత్తేసింది.మరి అన్ని నిల్వలుంటే ఆహార భద్రత సమస్య ఎందుకు వస్తున్నట్టు? ప్రజలకు నిజాలు చెప్పకుండా కేంద్రం మోసం చేస్తున్నదా?
‘ఆహార సబ్సిడీపై డబ్ల్యూటీవో ఆంక్షలు సడలిస్తే మరుసటి రోజు నుంచే ప్రపంచానికి తిండి పెట్టేలా ఆహార ధాన్యాల ఎగుమతికి భారత్ సిద్ధంగా ఉన్నది.’ ఏప్రిల్ 11న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాట ఇది. కానీ, సరిగ్గా నెల రోజులకే దేశం నుంచి గోధుమ ఎగుమతులను మోదీ సర్కారు నిషేధించింది. అందుకు చెప్పిన కారణం.. భవిష్యత్తులో దేశానికి ఆహార కొరత రాకుండా ఉండటానికే. అంటే నెల రోజుల్లోనే దేశంలోని ఆహార ధాన్యాల నిల్వలన్నీ తరిగిపోయాయా? లేదంటే దేశంలో ఎన్ని తిండిగింజలున్నాయో ప్రధానికి అవగాహనే లేదా?
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచం ముందు మరోసారి భారతదేశం పరువు తీసింది. అనాలోచిత, అవగాహన లేని నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠను దిగజార్చింది. ప్రపంచానికి తిండి పెట్టగలమని ప్రధాని నరేంద్రమోదీ గప్పాలు కొట్టి నెల తిరక్కముందే దేశం నుంచి గోధుమల ఎగుమతిని నిషేధించి నవ్వులపాలైంది. దేశం ఇప్పటికే విద్యుత్తు, బొగ్గు, ధరల పెరుగుదల సంక్షోభాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. ఈ సమయంలోనే ఆహార భద్రతపై అనుమానం వచ్చేలా కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది.
నాలుగేండ్లకు నిల్వలున్నాయంటూ..
దేశ ప్రజలకు నాలుగేండ్ల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయని నిన్నమొన్నటివరకు కేంద్ర మంత్రులు రోజూ చెప్తూ వచ్చారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనాలని రాష్ట్రప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమమే చేసినా, బియ్యంతోపాటు గోధుమల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని మొండిగా వాదించారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోదాముల్లో నిల్వకు ఖాళీయే లేదని గప్పాలు కొట్టారు. ఇప్పుడు ఉన్నట్టుండి శుక్రవారం గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించటంతో 130 కోట్లమంది ప్రజల ఆహార భద్రతతో మోదీ సర్కారు ఆటలాడుతున్నదని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. విద్వేష రాజకీయాలపై తప్ప ప్రజ ల భవిష్యత్తు అవసరాలపై బీజేపీ ప్రభుత్వానికి చింతలేదని మేధావులు విమర్శిస్తున్నారు.
గోధుమ రైతుపై పిడుగు
మోదీ సర్కారు ‘గుడ్డెద్దు చేలో పడ్డట్టు’ తీసుకొంటున్న నిర్ణయాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం ఒక్కటే కాదు.. విద్యుత్తు, బొగ్గు, చమురు, కరోనా తదితర ఏ అంశంపైనా మోదీ సర్కారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు గోధుమ ఎగుమతిపై హఠాత్తుగా నిషేధం విధించటంతో ఆ పంట పండించే రైతుల నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది. నిజానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా గోధుమలకు మంచి గిరాకీ ఉన్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచ సైప్లె చెయిన్ ఒడిదుడుకులకు లోను కావటంతో గోధుమ ధరలు మరింత పెరిగాయి. దీంతో మనదేశంలో గోధుమకు ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే ఎక్కువ రేటు లభిస్తున్నది. ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి రేటు పెంచి గోధుమలు కొంటున్నారు. దీంతో రైతులు మంచి ధర వస్తుందని సంతోషంలో ఉన్నారు. ఈ సమయంలో ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించటంతో వ్యాపారులు కొనటం ఆపేస్తారు. దీంతో ధరలు పడిపోయి రైతులను నట్టేట మునుగుతారని వ్యవసాయార్థికవేత్తలు అంటున్నారు.
దేశం పరువు గంగపాలు
అంతర్జాతీయంగా ఒకదేశం విశ్వసనీయత సంపాదించాలంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం అవసరం. క్లిష్ట సమయాల్లోనూ నమ్ముకొన్నవారిని ఆదుకొంటుందన్న భరోసా ఉన్నప్పుడే అంతర్జాతీయ సమాజం విలువ ఇస్తుంది. అలాంటి దేశాలతోనే ఇతర దేశాల వ్యాపార సంబంధాలు కూడా మెరుగ్గా ఉంటాయి. నెల క్రితం యూరప్ వెళ్లి ప్రపంచానికి తిండి పెడుతామని గొప్పలు చెప్పిన మన ప్రధాని, ఇప్పుడు మా తిండి గింజలు మాదగ్గరే ఉంచుకొంటామన్నట్టు నిర్ణయం తీసుకోవటంతో ప్రపంచదేశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకొనే చిన్నదేశాలు భారత్పై నమ్మకం కోల్పోతాయి. భారత్కు ఒక స్థిరమైన ఎగుమతుల విధానం లేదని అన్నివైపుల నుంచి విమర్శలు కూడా మొదలయ్యాయి. మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయం దేశ భవిష్యత్తు ఎగుమతులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని వాణిజ్య నిపుణులు అంటున్నారు. గోధుమల ఎగుమతులపై ఎంఈపీ (మినిమమ్ ఎక్స్పోర్ట్ ప్రైస్) పెడితే సరిపోయేదని, కానీ కేంద్ర ప్రభుత్వం అత్యంత అసంబద్ధమైన నిర్ణయం తీసుకొన్నదని విమర్శిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి కనీస ముందస్తు అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు.
మోదీ చర్యలతో దేశం నవ్వులపాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిలకడలేని విధానాలు, చర్యలవల్ల ప్రపంచం ఎదుట భారతదేశం నవ్వులపాలు అవుతున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు గొప్పగా చెప్పిన ప్రధాని, నెల రోజులు తిరక్కుండానే గోధుమల ఎగుమతిపై నిషేధం విధించారని శనివారం ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులపై మోదీకి ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. మోదీకి రైతులపై అభిమానం లేదని ఈ చర్యతో తేలిపోయిందని దుయ్యబట్టారు. వ్యవసాయంపై కేంద్రానికి ఒక విధానమంటూ లేదని విమర్శించారు. రైతులను దగా చేయడమే నరేంద్రమోదీ ఏకైక ఎజెండా అని ఆరోపించారు. దేశంలో ఏటా 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా, అందులో 50 శాతం దేశ ప్రజల కోసం నిల్వ చేసుకొని మిగతావి ఎగుమతి చేసుకొనే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉన్నదని పేర్కొన్నారు. గోధుమల ఎగుమతి అవకాశాలు పరిశీలించేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారుల బృందాన్ని మొరాకో, ట్యునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం, టరీ, అల్జీరియా, లెబనాన్ తదితర దేశాలకు పంపించారని, అంతలోనే కేంద్రం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిందని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.