హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు (exams) వాయిదాపడ్డాయి. ఎడతెరపి లేకుండా వర్షాల పడుతుండటంతో కాకతీయ వర్సిటీ పరిధిలో సోమ, మంగళవారాల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదావేశారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని రిజిస్ట్రార్ ప్రకటించారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ నేటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.