ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు (OU Foundation day) సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సన్నాహకంగా సోమవారం ఉదయం 2 కే రన్ (2K Run) నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల (Arts college) నుంచి ఎన్సీసీ గేటు (NCC Gate) వరకు సాగిన ఈ రన్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ నెల 25న (మంగళవారం) ఓపెన్ డే పేరుతో అన్ని విభాగాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిర్వహిస్తారు. ఆయా విభాగాలలో వివిధ పేర్లతో పలు పోటీలను సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 26న ఉదయం 10 గంటలకు ఆవిర్భావ వేడుకలను ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఓయూ పూర్వ విద్యార్థి, అంతరిక్షంలో కాలుమోపిన తొలి భారతీయుడు వింగ్ కమాండర్ రాకేశ్శర్మ (Rakesh Sharma) హాజరుకానున్నారు. సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనకు ప్రముఖ సినీ గేయ కవి సుద్దాల అశోక్తేజ (Suddala Ashok Teja) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
7వ నిజాం (7th Nizam) నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ (Mir Osman Ali khan) 1917, ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్ (రాజాజ్ఞ) జారీచేశారు. అడిక్మెట్ జాగీర్లో నిజాం 2వ నవాబు నుంచి మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓయూలో ఏప్రిల్ 26ను ఫౌండేషన్ డేగా నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తిచేసుకున్న ఓయూలో కోటి మందికిపైగా విద్యార్థులు చదుకున్నారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.