వరంగల్ : వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందని, దాన్ని సాహిత్య అకాడమి తిరిగి పునర్ముద్రించాలని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అన్నారు. బుధవారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ను ఎమ్మెల్సీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఓరుగల్లు నిఘంటువుపై చర్చించారు. కొన్ని దశాబ్దాల క్రితం తంజావూరు పబ్లికేషన్స్ పేరున ఓరుగల్లు నిఘంటువును వారు ముద్రించారని ఎమ్మెల్సీ తెలిపారు. వరంగల్ ప్రాంతంలో ఇప్పటికీ వెలుగు చూడని తరతరాల జానపద సాహిత్య జన చరిత్రను వెలుగులోకి తేవాలని ఆయన కోరారు.
పోతన విజ్ఞాన పీఠం, రాజరాజ నరేంద్ర గ్రంథాలయాలను శక్తివంతం చేయటానికి జరుగుతున్న కృషిలో పాలుపంచుకోవాలన్నారు. పాల్కురికి సోమనాథుని సమగ్ర సంకలనాలు వెలుగులోకి తేవాలని చెప్పారు.
బండ ప్రకాశ్ కోరిన విధంగా ఓరుగల్లు నిఘంటువు తిరిగి పునర్ముద్రిస్తామని గౌరీశంకర్ తెలిపారు. ఓరుగల్లు నిఘంటువు గ్రంథం అందుబాటులో లేదని, అందుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
కర్నూల్ కలెక్టరేట్లో ఇలాక్ గ్రంథాలయ విభాగంలో ఉన్నట్లు సమాచారం ఉందని, ఇందుకు సంబంధించి ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నామని జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.