సంస్థాన్ నారాయణపురం, జూలై 2: ఏడేండ్ల క్రితం తండ్రిని, ఏ డాది క్రితం తల్లిని కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఉండటానికి నిలువ నీడలేక అవస్థ పడుతున్నా రు. ఇటీవలి వర్షానికి ఉన్న ఇల్లు కూలిపోగా, దాతల సాయంతో కట్టిన ఇల్లు డబ్బులు చాలక గోడల వరకే పరిమితమైంది. పైకప్పు నిర్మాణానికి మనసున్న మారాజుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ చిన్నారులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు, ఉశమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ(9) ఉ న్నారు. వీరు కూలీ పనులు చేస్తూ బతికేవాళ్లు. ఏడేళ్ల క్రితం రాములు క్యాన్సర్తో చనిపోగా ఉశమ్మ ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో చిన్నారులు ఇద్దరు దిక్కులేనివారయ్యారు. వీరికి అమ్మమ్మ-తాతయ్యలే పోషిస్తున్నారు.
‘మాకెవరు దిక్కు’ శీర్షికన గతంలో ‘నమస్తే తెలంగాణ’ మినీలో ప్రచురితమైన కథనానికి స్పందించిన దాతలు నిత్యావసర సరుకులు, ఆన్లైన్ తరగతుల కోసం మొబైల్ ఫోన్, కొత్త దుస్తు లు, ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ఉన్న కాస్త ఇల్లు కూలిపోయింది. దీంతో రాత్రి పూట బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇంటి సామగ్రిని ప్లాస్టిక్ కవర్లతో చుట్టేసి ఆరుబయట భద్రపరిచారు. గతంలో దాతలు, స్థానికులు సమకూర్చిన డబ్బులతో గోడల వరకు ఇల్లు కట్టుకున్నారు. పైకప్పు నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేసి వర్షంలోనే బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పైకప్పు నిర్మాణం కోసం దాతలు సహకరించి ఆదుకోవాలని ఆ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.