మంచిర్యాల : 75 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు కార్మికుల శక్తి మీద నిలబడ్డాయి. కానీ, కార్మిక లోకానికి ఏనాడు ఒక్క మంచి పని చేయలేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్న 408 మంది స్థానికులకు మూడో విడతలో భాగంగా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి 76 జీఓ ను తీసుకువచ్చి సింగరేణి స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై చిన్నచూపు చూస్తూ నిధులు ఇవ్వడం లేదు. ఐనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో తాగునీటి సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి మహిళలు లెటర్ రాస్తే నేటి వరకు నీటి సమస్యను తీర్చలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నాడని విమర్శించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్గా నిలబడి మిషన్ భగీరథ నీటిని అందించాడన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడు దొంగల్లా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్యపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హాలికేరీ, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.