హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్యుత్తుశాఖలో నూతన అధ్యాయానికి తెలంగాణ మహిళలు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్కో) నూతన ఒరవడిని సృష్టించింది. ఇంతకాలం పురుషులకే పరిమితమైన జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల్లోకి మహిళలు ప్రవేశించారు. దసరా పండుగ సందర్భంగా వీరికి పోస్టింగ్స్ ఇచ్చారు. టీఎస్ ట్రాన్స్కో సుమారు 684 మందికి జూనియర్ లైన్మెన్గా పోస్టింగ్ ఇవ్వగా ఇందులో 199 మంది మహిళలే ఉండటం గమనార్హం. దసరా అంటేనే శక్తిస్వరూపిణి. అలాంటి పర్వదిన సందర్భంలో మహిళలు ఆరంగేట్రం చేస్తుండటం విశేషం.
1,100 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి 2017 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాన్ని పురుషులే చేయగలరన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ నోటిఫికేషన్కు మహిళా అభ్యర్థులు స్పందించారు. ఐటీఐ (ఎలక్ట్రీషియన్) చదివిన అనేక మంది రాత పరీక్షకు హాజరై, సత్తాచాటారు. వీరిని కూడా అతి కఠినమైన టవర్ ైక్లెంబింగ్ టెస్టుకు ఆహ్వానించారు. సాధారణంగా ఇతర సంస్థల్లో 10 మీటర్ల ఎత్తు ఎక్కగలిగే పోల్ ైక్లెంబింగ్ టెస్టు నిర్వహిస్తారు. దీంతో పోల్చుకొంటే టవర్ ైక్లెంబింగ్ కష్టమైనది.
అందులోనూ హైటెన్షన్ వైర్లు ఉండే టవర్లను ఎక్కేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూనే ధైర్యంగా కదలాలి. ఈ పోటీలో 220 కేవీ సామర్థ్యం గల టవర్ను 20 మీటర్ల ఎత్తువరకు ఎక్కాల్సి ఉంటుంది. అంటే సుమారు 7 అంతస్తుల భవనం అంత ఎత్తుకు ఎక్కి.. టవర్కు మరోవైపునుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ను పురుషులతో దీటుగా మహిళలూ ఛేదించడం విద్యుత్తుశాఖ అధికారులనే ఆశ్చర్యపరిచింది. ఈ ఉద్యోగాల్లో మహిళలు ప్రవేశించిన నేపథ్యంలో ఈ పోస్టు పేరును మార్చే అవకాశమున్నది. లైన్మెన్ పదం పురుషులకు ఉద్దేశించినది కావడంతో లింగసమానత్వాన్ని ప్రతిబింబించేలా మార్చనున్నారు.
ఆర్టిజన్లకు అందివచ్చిన అవకాశం
గతంలో సీఎం కేసీఆర్ విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేశారు. వీరికి జూనియర్ లైన్మెన్ రాత పరీక్షలో 20 మార్కులను వెయిటేజీగా ఇచ్చారు. దీంతో వీరిలో సుమారు 415 మంది జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలను దక్కించుకోగాలిగారు. తమకు వెయిటేజీ ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
త్వరలో మరో 250 పోస్టులకు పిలుపు
ట్రాన్స్కో 1,100 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో సుమారు 150 పోస్టులకు అర్హులు లేక వాటిని భర్తీ చేయలేదు. 950 పోస్టుల భర్తీకి అర్హులతో జాబితా తయారుచేసి, టవర్ ైక్లెంబింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన 684 మందికి పోస్టింగులిచ్చారు. రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా మరో 250 పోస్టులకు అభ్యర్థులను ైక్లెంబింగ్ టెస్టుకు ఆహ్వానిస్తామని ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. త్వరలోనే మొత్తం పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
సత్తా చాటుతాం
మాకు ఈ అవకాశం కల్పించిన ట్రాన్స్కోకు ధన్యవాదాలు. సంస్థ ఈ అవకాశం కల్పించకపోతే మాకు భాగస్వామ్యం ఉండేది కాదు. టవర్ ఎక్కే పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నాం. దసరా సందర్భంగా పోస్టింగ్స్ ఇవ్వడం మా సంతోషాన్ని రెట్టింపు చేసింది. అందరితో సమానంగా మా సత్తా చాటుతాం.
–భూక్య జ్యోతి, నెక్కొండ, వరంగల్
మంచి పేరు తెచ్చుకొంటాం
ఇప్పటివరకు మహిళలకు స్థానం లేని పోస్టుల్లో.. తొలిసారిగా అవకాశం కల్పించిన ట్రాన్స్కో సీఎండీ, యాజమాన్యానికి కృతజ్ఞతలు. అందరితో సమానంగా టవర్ ైక్లెంబింగ్ చేయడం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దసరా సందర్భంగా పోస్టింగ్స్ ఇవ్వడం సంతోషం. మాపై పెట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి.. మంచి పేరు తెచ్చుకొంటాం.
– కొండబత్తుల స్వర్ణలత, మహబూబాబాద్ జిల్లా