హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) గవర్నింగ్ కౌన్సిల్-2022 ఎన్నికల్లో తన ఆన్లైన్ ఓటును గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్చేసి వినియోగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ చైర్మన్ బ్రహ్మారెడ్డి ఇటీవల సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 30న జరిగిన ఈ ఎన్నికల్లో తాను ఆన్లైన్ ద్వారా ఓటు వేసేందుకు ప్రయత్నించగా మధ్యాహ్నం 2.10కే వేరే వ్యక్తులు ఆ ఓటును వేసేసినట్టు తేలిందని, దీనిపై ఐఈటీఈ ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని వివరించారు. దీంతో కేసు నమోదుచేసి రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ఆ ఓటు మహారాష్ట్రలోని అమరావతి నుంచి పడినట్టు తేల్చారు. దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.