హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. అరణ్య భవన్లో గురువారం ఆయన ఉజ్జయినీ మహంకాళీ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఆన్ లైన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారని, వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చన్నారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు కుంకుమ కూడా పంపిస్తారని చెప్పారు.
ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టీయాప్ ఫోలియో, మీ సేవ, ఆలయ వెబ్సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశ, విదేశీ భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశీయ సేవలకు గానూ రూ. 300, అంతర్జాతీయ సేవలకుగానూ రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు.