ధర్మారం/రామడుగు/బోయినపల్లి, ఆగస్టు 4 : కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-2లోని నంది, గాయత్రీ పంప్హౌస్లలో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. గత నెల 27 నుంచి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్హౌస్కు చేరిన నీటిని ఎత్తిపోస్తుండగా, ఆదివారం నాలుగు మోటర్ల ద్వారా కొనసాగించారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు.
ఈ రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తడంతో గ్రావిటీ కాల్వ ద్వారా జంట సొరంగాలకు చేరి అక్కడి నుంచి 7, 8వ ప్యాకేజీలలోని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలి పోతున్నాయి. అక్కడి నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, అక్కడి నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఆదివారం వరకు ఎల్లంపల్లి నుంచి 9.8 టీఎంసీల జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్ తెలిపారు.