కరోనా, డెంగ్యూ, క్షయపై ప్రభావం
వ్యాక్సిన్ తయారీలో సీసీఎంబీ సక్సెస్
దేశీయంగానే ఎంఆర్ఎన్ఏ సాంకేతికత
కేవలం పది నెలల్లోనే ప్రయోగం.. ప్రపంచంలోనే అత్యంత విభిన్నం
సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ వెల్లడి
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనాకు ఓ టీకా, మలేరియాకు ఓ టీకా, డెంగ్యూకి ఓ టీకా.. ఇలా ఒక్కో రోగానికి ఒక్కో టీకా కాకుండా నాలుగైదు రోగాలకు కలిపి ఒకే టీకా ఉంటే..! ఆ దిశగా దృష్టి సారించిన సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ).. దేశీయంగా ఒక కొత్త టీకాను అభివృద్ధి చేసింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ వివరాలను శుక్రవారం హైదరాబాద్లోని సీసీఎంబీలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి వెల్లడించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ వ్యాక్సిన్ టెక్నాలజీలో ఎంఆర్ఎన్ఏ చాలా కీలకమని, ప్రపంచంలోనే భిన్నమైన రీతిలో తాము కొత్త టీకాను అభివృద్ధి చేశామని తెలిపారు.
అటల్ ఇంక్యుబేషన్ సెంటర్-సీసీఎంబీ (ఏఐసీ-సీసీఎంబీ) బృందం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందని వివరించారు. ఈ వ్యాక్సిన్ కరోనాకు మాత్రమే కాకుండా, డెంగ్యూ, క్షయ, మలేరియా వంటి వ్యాధులపైనా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్లు పుడుతున్న తరుణంలో ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో వాటిని సమర్థంగా ఎదుర్కొనవచ్చని చెప్పారు. పది నెలల్లోనే ఈ దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేశామని ఏఐసీ-సీసీఎంబీ సీఈవో ఎన్ మధుసూదనరావు తెలిపారు. అమెరికా అభివృద్ధి చేసిన మోడెర్నా, ఫైజర్ టీకాలు ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో తయారు చేసినా, దేశీయంగా తయారుచేసిన ఈ టీకాను సీసీఎంబీ విభిన్నంగా అభివృద్ధి చేసిందని వివరించారు. ఈ టెక్నాలజీతో దేశ కీర్తి మరింత పెరిగిందని అన్నారు.
కరోనాపై మెరుగైన ప్రభావం
సీసీఎంబీ అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికత సార్స్-సీవోవీ-2పై మెరుగ్గా పనిచేస్తున్నదని ప్రాజెక్టు శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్ అయ్యర్ తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో సార్స్-సీవోవీ-2 స్పైక్ ప్రోటీన్కు ఎంఆర్ఎన్ఏ టీకాను రెండు మోతాదులు ఇచ్చి పరిశీలించగా.. వైరస్ల బంధనాన్ని నిరోధించటంలో 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసిందని వెల్లడించారు. ప్రత్యక్షంగా టీకా సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.