హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 50 మెగావాట్ల రూఫ్టాప్ సౌరవిద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టీఎస్రెడ్కో వీసీ అండ్ ఎండీ జానయ్య వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 260 మెగావాట్ల సౌరవిద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు.
ప్రతి 3 కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటుకయ్యే రూ.లక్షలో 40 వేలు సబ్సిడీ లభిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ నుంచి రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని వివరించారు.
ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,000 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించినట్టు జానయ్య వెల్లడించారు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ను నెలకొల్పుతున్నామని, ఒకట్రెండు నెలల్లో ఇవి సిద్ధమవుతాయని తెలిపారు.
వీటిలో అత్యధిక స్టేషన్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లు, 400 కార్లు వినియోగంలో ఉన్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలు, నిబంధనలు, సమీపంలోని చార్జింగ్ స్టేషన్ల వివరాలను టీఎస్రెడ్కో పోర్టల్ ద్వారా పొందవచ్చని తెలిపారు.