నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కూడా నియోజకవర్గ పరిధిలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నగదు, ఇతరత్రా వస్తువుల తరలింపుపై పోలీసులు నిఘా ఉంచారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అయితే ఉప ఎన్నిక కోసం బీజేపీ తీసుకొస్తున్న రూ. కోటిని పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా, ఈ నగదు పట్టుబడింది. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంలో రూ. కోటిని తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నగదుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.