బెజ్జూర్, జూలై 21 : వాగులు ఉప్పొంగడం.. రోడ్లు కోతకు గురవడంతో దవాఖానకు బయలుదేరిన ఓ గర్భిణి మార్గమధ్యంలో రోడ్డు పక్కన డెలివరీ అయ్యింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మొగవెళ్లి గ్రామానికి చెందిన కొడ్ప మల్లుబాయికి గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 10 కిలోమీటర్ల దూరంలోని బెజ్జూర్ పీహెచ్సీకి మొగవెల్లి నుంచి సోమిని మీదుగా బయలుదేరారు.
వర్షం పడుతుండగా సుస్మీర్, కుశ్నపల్లి ఒర్రెలు ఉప్పొంగాయి. మల్లుబాయి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఏదైనా వాహనంలో చింతలమానేపల్లి, గూడెం గ్రామాల మీదుగా రావాలని వారు సూచించారు. మల్లుబాయిని ఆటోలో తీసుకెళ్తుండగా.. కోయపల్లి, గూడెం గ్రామాల మధ్య గల వాగు వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో ఇటు ఆటో, అటు 108 అంబులెన్స్ నిలిచిపోయా యి. ఆటో డ్రైవర్ మల్లుబాయిని అక్క డే వదిలివెళ్లాడు. అంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో 108 ఈఎంటీ మధూకర్ వెళ్లి మల్లుబాయికి రోడ్డు పక్కనే డెలివరీ చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.