హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్లో ఒమిక్రాన్ వేరియంట్ దాగుడుమూతలు ఆడుతున్నది. ఈ నెల ప్రారంభంలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒక మహిళకు 8 రోజుల క్వారంటైన్ తరువాత కరోనా పాజిటివ్ వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా ఒమిక్రాన్గా తేలిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. హన్మకొండకు చెందిన ఆ మహిళను హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కోఠిలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాజా కేసుతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి పెరిగిందన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. తొమ్మిది మందిలో ముగ్గురు కెన్యా, ఇద్దరు అబుదాబీ, ఇద్దరు దుబాయ్, సూడాన్, బ్రిటన్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరు మాత్రమే రెండు డోసుల టీకాలు వేసుకున్నట్టు తేలిందన్నారు. డెల్టా సోకినవారిలో 70 శాతం మంది అసిమ్టమాటిక్ (వ్యాధి లక్షణాలు లేకపోవడం) కాగా, ఒమిక్రాన్కు సంబంధించి 90 శాతం అసిమ్టమాటిక్ కేసులే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నదని, ఒమిక్రాన్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వేరియంట్ సోకినవారికి తీవ్రమైన లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. టోలిచౌకిలోని పారమౌంట్ కాలనీలో గురువారం వరకు 647 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. నివేదికలు రావాల్సి ఉన్నదన్నారు.