భర్త మృతిని తట్టుకోలేక భార్య కన్నుమూత
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 22: వృద్ధ దంపతులు చావులోనూ ఒక్కటయ్యారు. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య మనోవేదనతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జరిగింది. సంస్థాన్ నారాయణపురానికి చెందిన ఎడ్ల లక్ష్మయ్య(90), ఎడ్ల లక్ష్మమ్మ(85) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కొనేండ్ల క్రితం అనారోగ్యం బారిన పడిన లక్ష్మయ్య బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతిచెందాడు. భర్త మరణ వార్త విని తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ రాత్రి 8గంటల ప్రాంతంలో కన్నుమూసింది. వీరి కుమారుడు 12 ఏండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు కూతుళ్లు తలకొరివి పెట్టారు. వృద్ధ దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.