హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Prashanth Reddy) ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సీఎం సమీక్ష అనంతరం హైదరాబాద్ సచివాలయంలో నిజామాబాద్,కామారెడ్డి ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
ఎల్ఎండీ(LMD) ఎగువ భాగం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా ఉండగా..ఎస్సారెస్పీ ప్రాజెక్ట్(SRSP)లో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం లో భాగంగా కాళేశ్వర జలాలు(Kaleshwaram) రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలను లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లో నింపాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. నీటిని లిఫ్ట్ చేయడానికి సంబంధించిన మూడు పంపుహౌజ్ లు సిద్ధం చేయాలని సీఈ సుధాకర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లాలో ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించడం కోసం గుత్పా, అలీసాగర్,లక్ష్మి కెనాల్,చౌట్పల్లి హన్మంతు రెడ్డి తదితర లిఫ్ట్ లకు, కాకతీయ కెనాల్ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. నిజాంసాగర్(Nizamsagar) లో 5 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా వానాకాలం సాగు కోసం రైతులకు నీటిని విడుదలకు ఏర్పాట్లు చేయాలని కామారెడ్డి సీఈ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.