Tirumala | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నంద్యాల జిల్లాలో తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూపార్లో ఆశ్రయం పొందుతున్న పులిపిల్లలకు వేట శిక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పులిపిల్లలు స్వతహాగా వేటాడి ఆహారం సేకరించుకోవడంపై తర్ఫీదునిచ్చేందుకు నల్లమల అడవిలో భారీ టైగర్ ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోగా, స్థానికుల సహాయంతో అటవీశాఖ సిబ్బంది తిరుపతిలోని వేంకటేశ్వర జూపారుకు తరలించారు. ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల చనిపోగా.. మిగతా పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేసి సంరక్షిస్తున్నారు. ప్రసుతం అవి అభయారణ్యంలో వేట నేర్చుకునేందుకు వీలుగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను ఇప్పటికే సిద్ధం చేశారు.
తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారి పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజ్ పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటుచేశారు. వేట తర్ఫీదు పొందేలా 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేలా ఎన్క్లోజర్ చలువ పందిళ్లు, నీటి స్ప్రింక్లర్లను ఏర్పాటుచేశారు.