కుమ్రంభీం ఆసిఫాబాద్ : మహారాష్ట్రకు అక్రమంగా ( Smuggled)తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని(Ration rice) అధికారులు పట్టుకున్నారు.రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు కౌటాల మండలం తలోడీ క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేపట్టారు. నిందితులు అడ్లూరి గోపాల్, అడ్లూరి ఆశాలు, కామెర దేవాజి, పొరుశెట్టి అంజయ్య, సత్పుతే కిశోర్, బోర్కుటే భీమయ్య బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
నిందితులను విచారించగా వివిధ ప్రాంతాలకు చెందిన కార్డు దారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి మహారాష్ట్రలో అధిక ధరకు అమ్మి అక్రమంగా లాభం పొందుతారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.