హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. 22న భాగ్యరెడ్డివర్మ 134వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. భాగ్యరెడ్డివర్మ మే 22, 1888 జన్మించగా, ఫిబ్రవరి 18, 1939లో దివంగతులయ్యారు. భాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కర్తగా, ఆది ఆంధ్రసభ స్థాపకుడిగా, హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కారం నాటకమండలి, అహింసా సమాజాలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతంలో సంఘసంస్కరణలకు జీవితపర్యంతం విశేష కృషి చేశారు.