హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రసంగానికి ఒడిశా నేతలు మంత్రముగ్ధులయ్యారు. ఒడిశా భౌగోలిక స్థితిగతులు, సహజ వనరులైన నదీ జలాల వినియోగం, మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ఉటంకిస్తూ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నంతసేపు తెలంగాణ భవన్ చప్పట్లతో మార్మోగిపోయింది. శుక్రవారం తెలంగాణ భవన్లో ఒడిశా మాజీ సీఎం, సీనియర్ రాజకీయ నేత, తొమ్మిది సార్లు ఎంపీగా పనిచేసిన నేత గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీలు హేమ, జయరాం పంగీ సహ పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒడిశా నలుమూల నుంచి రైతు నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత ప్రసంగించిన తీరు, ఆయన లేవనెత్తిన అంశాలపై ఒడిశా నేతలు ఆసక్తిగా విన్నారు.
‘ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. అయినా సాగునీటికి, తాగునీటి కష్టాలెందుకు ఉండాలి? ఈ పాపం ఎవరిది?’ అని ఆయన ప్రశ్నించినప్పుడు ‘పాలకులదే.. పాలకులదే’ అని పెద్ద పెట్టున ఒడిశా నేతలు ప్రతిస్పందించారు. ‘తాల్చేర్ విద్యుత్తు ప్రాజెక్టుతో తళుకులీనాల్సిన ఒడిశా, కరెంట్ కష్టాలతో ఎందుకు తల్లడిల్లాలి? అని ప్రశ్నిస్తూ, ఒడిశాలోని యువశక్తి ఉపాధి కోసం దేశమంతా తిరగాల్సిన ఖర్మ ఏం పట్టింది? అని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఒడిశా భౌగోళిక, సహజ వనరులు, మానవ వనరుల వినియోగం, స్థితి, దుస్థితిలపై సీఎం కేసీఆర్కు ఉన్న అవగాహన, వాటిని పరిష్కరించే మార్గాల పట్ల స్పష్టతకు వేదిక మీదున్న మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ అనుభవజ్ఞులే కాకుండా సమావేశ మందిరంలో ఉన్న ఒడిశా నేతలు చప్పట్లు కొడుతూ ‘వాహ్..కేసీఆర్జీ’ అంటూ ప్రశంసించారు. అలాగే ప్రపంచంలో ఏ దేశానికి లేని సహజ, మానవ వనరులు భారతదేశానికే ఉన్నాయని, వాటిని సరియైన పద్ధతిలో వినియోగించుకోలేనితనానికి పాలకుల లక్ష్యలేమి కారణమని సీఎం కేసీఆర్ ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పుడు ‘సహీ యే.. సహీ యే’ అంటూ ఒడిశా నేతల ప్రతిస్పందనతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది.